Char Dham: చార్‌ధామ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు.. ఉత్తరాఖండ్‌ పోలీసుల కీలక సూచన

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు (Char Dham Yatra) ఈసారి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో భక్తులకు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) పోలీసులు కీలక సూచన చేశారు.

Published : 31 May 2023 17:44 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు (Char Dham Yatra) ఈసారి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో మంచు కొండల్లో ప్రయాణానికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) పోలీసులు కీలక సూచన చేశారు. సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువగా చార్‌ ధామ్‌ దర్శనానికి భక్తులు వస్తున్నారని అన్నారు. నవంబర్‌ వరకు ఈ యాత్ర కొనసాగుతున్నందున.. అందుకు అనుగుణంగా భక్తులు తమ దర్శన సమయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 25నుంచి ఇప్పటివరకు కేదార్‌నాథ్‌ను (Kedarnath) 6లక్షల మంది సందర్శించారు. బద్రీనాథ్‌ (Badrinath) తెరిచినప్పటి (ఏప్రిల్‌ 27) నుంచి 5లక్షల మంది దర్శించుకున్నారు. కాగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలను నిత్యం సరాసరి 20వేల మంది సందర్శిస్తున్నారని.. కానీ అక్కడి సామర్థ్యం రోజుకు కేవలం 10వేలు మాత్రమేనని అన్నారు. ఇలా సామర్థ్యానికి మించి విపరీతమైన సంఖ్యలో భక్తులు వస్తోన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు.

తొందరపడొద్దు.. నవంబర్‌ వరకూ ఉంటుంది..

‘చార్‌ధామ్‌ ఆలయాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అక్కడి సామర్థ్యం కంటే అనేక రెట్లు అధికంగా భక్తులు రావడంతో అన్ని రకాలుగా అసౌకర్యం ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ మేనేజిమెంట్‌కు ఇబ్బందిగా మారడంతోపాటు ఆలయాలకు వెళ్లే ట్రెకింగ్‌ మార్గాలు కొన్నిసార్లు జామ్‌ అవుతుండటం, భక్తులకు దర్శనం సాఫీగా సాగకపోవడానికి కారణం అవుతున్నాయి. మే, జూన్‌లోనే ఈ యాత్ర ఉంటుందని చాలామంది భక్తులు భావిస్తుంటారు. నవంబర్‌ రెండో వారం వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఆలయాలను దర్శించడానికి సెప్టెంబర్‌ రెండో వారం తర్వాత అనుకూలమైన సమయం. అందుకే అందుకు అనుగుణంగా భక్తులు తమ ప్రయాణాన్ని మార్చుకోండి’ అని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. గంగోత్రి, యమునోత్రి కోసం హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా నుంచి వచ్చే భక్తులు ముస్సోరీ మార్గాన్ని అనుసరించవద్దని సూచించారు.

మరోవైపు వాతావరణ సమాచారాన్ని ముందే తెలుసుకుంటూ యాత్రకు బయలుదేరాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కూడా చార్‌ధామ్‌ భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని