సెప్టెంబరు నుంచి 12-18ఏళ్ల వారికీ టీకా

దేశంలో కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెద్దలతో పాటు చిన్నారులకు కూడా వైరస్‌ నుంచి రక్షణ కల్పించేలా

Updated : 09 Jul 2021 12:21 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెద్దలతో పాటు చిన్నారులకు కూడా వైరస్‌ నుంచి రక్షణ కల్పించేలా టీకాల ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది నెలల్లో పద్దెనిమిదేళ్ల లోపువారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సెప్టెంబరు నుంచి 12-18 ఏళ్ల వారికి జైడస్‌ టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్‌ డా. ఎన్‌కే అరోరా తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆ తర్వాత కొవాగ్జిన్‌ టీకా కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. 

‘‘12-18 ఏళ్ల వారికి జైడస్‌ టీకా ప్రయోగాల ఫలితాలు త్వరలో రానున్నాయి. మరికొద్ది వారాల్లో ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలున్నాయి. సెప్టెంబరు చివరి నాటికి ఈ వ్యాక్సిన్‌ చిన్నారులకు అందుబాటులోకి రావొచ్చు. ఇక, పిల్లలపై కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు మొదలయ్యాయి. అవి సెప్టెంబరు నాటికి పూర్తవనున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం లేదా వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నాటికి 2-18 ఏళ్ల వారికి కూడా టీకా అందుబాటులోకి వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి’’ అని అరోరా చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ మూడో దశ ముప్పు నేపథ్యంలో చిన్నారులకు టీకాలు ఇచ్చే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అంతేగాక, పాఠశాలల పునఃప్రారంభం చాలా ముఖ్యమైన విషయమని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

ఇప్పటివరకు వచ్చిన కరోనా రెండు దశల్లో చిన్నారులపై వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రభుత్వాలు తెరవడం లేదు. మరోవైపు పిల్లలపై పలు సంస్థల టీకాల ప్రయోగాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని