వ్యాక్సిన్‌పై సంకోచం.. కరోనాకు ఆహ్వానమే! 

కరోనా మహమ్మారిపై పోరాటంలో బ్రహ్మాస్త్రమైన వ్యాక్సినేషన్‌పై సంకోచించడమంటే కరోనాకు ఆహ్వానం పలకడమేనని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. సోమవారం ఆయన....

Published : 22 Jun 2021 01:46 IST

అందరూ టీకాలు వేసుకోవాలన్న కేంద్రమంత్రి నఖ్వీ

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో బ్రహ్మాస్త్రమైన వ్యాక్సినేషన్‌పై సంకోచించడమంటే కరోనాకు ఆహ్వానం పలకడమేనని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. సోమవారం ఆయన యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంపూర్‌లోని చమరౌ పీహెచ్‌సీ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు వ్యక్తలు తమ స్వార్థ ప్రయోజనాల వ్యాక్సిన్లపై అపోహలు, భయాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి శక్తులు  దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు వ్యతిరేకులుగా పేర్కొన్నారు. 

రాబోయే రోజుల్లో సామాజిక, విద్యా సంస్థలు, ఎన్జీవోలు, స్వయం సహాయక సంఘాలతో కలిసి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇప్పటికే పలు మతాలకు చెందిన పెద్దలు, సామాజిక, విద్య, సాంస్కృతిక, వైద్య, సైన్స్‌ రంగాలకు చెందిన ప్రముఖులతో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ సందేశాలు ఇస్తున్నట్టు ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా వీధి నాటకాలను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది. 

మన శాస్త్రవేత్తల శ్రమ ఫలితంగా దేశంలో ఉత్పత్తి అయిన రెండు వ్యాక్సిన్లూ పూర్తి సురక్షితమైనవిగా సురక్షితమైనవని పునరుద్ఘాటించారు. కరోనాను ఎదుర్కోవడంలో సమర్థవంతమైన ఆయుధాలుగా పనిచేస్తున్నట్టు రుజువైనట్టు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని కరోనా రహిత భారత్‌ సాధనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా హజ్‌ కమిటీలు, వక్ఫ్‌ బోర్డులు, వాటి అనుబంధ సంఘాలు, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, మౌలానా అజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, పలు సామాజిక, విద్యాసంస్థలు, ఎన్జీవోలు, స్వయం సహాయక గ్రూపులన్నీ వ్యాక్సినేషన్‌ అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిందని, ఇప్పటికే కోట్లాది మందికి టీకాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని ఓడించడంలో ప్రభుత్వం, సమాజం ఐక్యంగా కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని