Vaccine: టీకా మిక్సింగ్‌తో వేరియంట్లకు చెక్‌?

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం ద్వారా దీర్ఘకాలం ఉండే రోగనిరోధక శక్తితో పాటు....

Published : 21 Jun 2021 13:42 IST

స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం(వ్యాక్సిన్‌ మిక్సింగ్‌) ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త రకాల నుంచి రక్షనిచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం వల్ల కొత్త రకాలపై వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ‘ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇది ఒక అవకాశమనే చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

అయితే, యూకే, స్పెయిన్‌, జర్మనీ నుంచి లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం వల్ల జ్వరం, నొప్పి, సహా ఇతర దుష్ప్రభావాల తీవ్రత అధికంగా ఉన్నట్లు గమనించామని తెలిపారు. అదే సమయంలో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే బలమైన రోగనిరోధక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోందన్నారు.

బూస్టర్‌.. తొందరపాటే!

మరోవైపు కొన్ని దేశాలు, ఔషధ సంస్థలు కొవిడ్‌ బూస్టర్‌ డోసుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడే బూస్టర్ డోసు గురించి ప్రణాళికలు వేసుకోవడం తొందరపాటు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు బూస్టర్‌ డోసును సిఫార్సు చేసేందుకు కావాల్సిన సమాచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదని స్వామినాథన్ స్పష్టం చేశారు. ఇంకా కరోనా వైరస్‌, వ్యాక్సిన్లకు సంబంధించిన శాస్త్రపరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ  కొన్ని దేశాలు తొలి డోసు కూడా ఇవ్వలేదని.. ఈ తరుణంలో బూస్టర్ డోసు గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని స్పష్టం చేశారు.

బూస్టర్‌ డోసుపై యూకేలో ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దేశ జనాభాలో అత్యధిక మందికి టీకాలు అందజేసిన యూకే.. కొత్త వేరియంట్ల నుంచి తప్పించుకునేందుకు బూస్టర్ డోసు అవసరమని భావిస్తోంది. ఈ మేరకు ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని