‘బిలియనీర్లకు ఎర్రతివాచీలు.. రైతులకు గోతులా?’

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రైతులను నిలువరించే క్రమంలో ఓ పోలీసు రైతుపై లాఠీ లేపిన ఫొటో ఒకటి పలువురి దృష్టిని ఆకర్షించింది..........

Published : 28 Nov 2020 13:44 IST

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌

(చిత్రం: రాహుల్‌ గాంధీ ట్విటర్‌)

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రైతులను నిలువరించే క్రమంలో ఓ రైతుపై పోలీసు లాఠీ లేపిన ఫొటో ఒకటి పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఆ సంఘటన తనని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బాధాకరమైన చిత్రం: జై జవాన్‌.. జై కిసాన్‌ అన్నది మన నినాదం. కానీ, ఈరోజు ప్రధాని మోదీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

 

(చిత్రం: ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌)

రైతుల ఆందోళనలకు సంబంధించిన పలు చిత్రాలను షేర్‌ చేసిన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బడా కార్పొరేట్లకు ఎర్రతివాచీలతో స్వాగతం పలికే మోదీ సర్కార్‌.. రైతులు వస్తే మాత్రం రోడ్లపై గోతులు తవ్వుతున్నారని విమర్శించారు. ‘‘భాజపా సర్కార్‌ ఆధ్వర్యంలో దేశంలో వ్యవస్థలు ఎలా తయారయ్యాయో చూడండి. భాజపాకు చెందిన బిలియనీర్‌ మిత్రులు దిల్లీకి వస్తే వారికి ఎర్రతివాచీలతో స్వాగతం పలుకుతారు. రైతులు వస్తే మాత్రం రోడ్లపై గుంతలు తవ్వుతున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేయడం సరైనదేనట. కానీ, వాటిని నిరసిస్తూ దిల్లీకి రావడం మాత్రం తప్పా?’’అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. 

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా రైతులు చేస్తున్న నిరసన ఈరోజూ కొనసాగుతోంది. నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ.. రైతులు మాత్రం దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బలగాల్ని భారీగా మోహరించారు. నేడు మరికొంత మంది రైతులు ఈ ఆందోళనల్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని