Kabul Airport: అఫ్గాన్ల ప్రాణ భయానికి నిదర్శనం కాబుల్‌ ఎయిర్‌పోర్టు

లాక్‌డౌన్‌ ప్రకటించగానే మన దేశంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. ప్రజలు వాహనాలు ఎక్కేందుకు ఎగబడటం చూశాము కదా.. ప్రస్తుతం అఫ్గానిస్థాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది.

Updated : 16 Aug 2021 11:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ ప్రకటించగానే మన దేశంలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. ప్రజలు వాహనాలు ఎక్కేందుకు ఎగబడటం చూశాం కదా.. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వేలమంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు.

రాజధాని కాబుల్‌ను తాలిబన్లు చుట్టుముట్టారన్న వార్త తెలియగానే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల బాటపట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది మొదట కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు ఎక్కువగా ఉండటంతో ముష్కర మూకలను అడ్డుకొంటాయని వారు ఆశించారు. కానీ, ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు.

అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన వార్త తెలుసుకోగానే..  వేల మంది నగరవాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కాల్పుల చప్పుడుతో పరుగులు..

ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం కాబుల్‌ విమనాశ్రయం తాలిబన్ల గురిలోకి వచ్చిందని అమెరికా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు అమెరికా దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించింది.

129 మంది ప్రయాణికులతో దిల్లీకి చేరిన ఎయిర్‌ ఇండియా విమానం..

ఎయిర్‌ ఇండియా విమానం 129 మంది ప్రయాణికులతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకొంది. రాత్రి 8 గంటల సమయంలో ఇది రన్‌వేపై దిగింది. మరోపక్క కాబుల్‌ నుంచి దిల్లీకి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది. రెండు విమానాలను అత్యవసరాల కోసం సిద్ధంగా ఉంచింది. అఫ్గానిస్థాన్‌కు వెళ్లే విమానాన్ని మధ్యాహ్నం 12.30కు రీషెడ్యూల్‌ చేసింది. వాస్తవానికి ఈ విమానం రాత్రి 8.50కు వెళ్లాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని