Delhi LG: దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణ స్వీకారం

దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు...

Published : 26 May 2022 14:26 IST

దిల్లీ: దిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేబినెట్‌ మంత్రులు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. గతంలో ఇక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా విధులు నిర్వహించిన అనిల్‌ బైజల్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దానిని ఆమోదించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మే 23న కొత్త ఎల్జీగా సక్సేనాను కేంద్రం నియమించింది.

1958 మార్చి 23న జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా.. కాన్పూర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజస్థాన్‌లోని జేకే గ్రూప్‌ సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లోని ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షించేందుకు గాను 1995లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టి, ధోలేర పోర్టు ప్రాజెక్ట్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. అనంతరం భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. భారత అమృతోత్సవాల నిర్వహణకు గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సభ్యుల్లో సక్సేనా ఒకరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు