War widow: పింఛను కోసం 56 ఏళ్ల న్యాయ పోరాటం.. ఎట్టకేలకు ఆ మహిళ విజయం

పింఛను డబ్బుల కోసం ఏకంగా 56 ఏళ్లపాటు పోరాడిన మహిళ ఎట్టకేలకు విజయం సాధించింది........

Published : 13 Apr 2022 23:41 IST

చండీగఢ్‌: యుద్ధంలో ఓ సైనికుడు వీరమరణం పొందగా.. నాలుగేళ్లపాటు ఆయన భార్యకు పింఛను​ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత ఉన్నట్టుండి ఆపేసింది. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉంది ఆ బాధితురాలు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 56 ఏళ్లపాటు పోరాడింది. ఈ అంతులేని పోరాటంలో చివరకు ఆమె విజయం సాధించింది. బాధితురాలికి 6శాతం వడ్డీతో మొత్తం పెన్షన్​ చెల్లించాలని చండీగఢ్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

1962 ఇండియా-చైనా యుద్ధంలో పర్తాప్​ సింగ్​ అనే సీఆర్పీఎఫ్ జవాను వీర మరణం పొందాడు​. ఆ తరువాత ఆయన భార్య ధర్మోదేవికి ప్రభుత్వం నాలుగేళ్లపాటు పింఛను ఇచ్చింది. కానీ 1966 నుంచి పెన్షన్ ఇవ్వడం ఆపేసింది. దీంతో బాధితురాలు చండీగఢ్​ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆమె న్యాయపోరాటం చేస్తూనే వచ్చింది. కాగా ఆమె పోరాటానికి 56 ఏళ్ల తర్వాత ఫలితం దక్కింది. 1966 నుంచి బాధితురాలికి రావాల్సిన పింఛను బకాయిల్ని చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. 6శాతం వడ్డీతో బకాయిలను చెల్లించాలని జస్టిస్ హర్సిమాన్​ సింగ్​ సేథీ ధర్మాసనం  కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు వాదనల సందర్భంగా.. నిర్దిష్ట కారణం లేకుండానే పింఛను నిలిపివేశారని, బాధితురాలు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆమె తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పెన్షన్​ను ఆపేయడం తమ ఉద్దేశం కాదని.. సమాచారం లోపం వల్లే ఇలా జరిగిందని హైకోర్టుకు కేంద్రం, సీఆర్ఫీఎఫ్​ తెలిపాయి. 56 ఏళ్లుగా చట్టబద్ధమైన హక్కులను బాధితురాలు కోల్పోయిందని, దీంతో అప్పటి నుంచి రావాల్సిన ఇతర అలవెన్సులు పొందేందుకు ఆమె అర్హురాలని బాధితురాలి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. విచారణ అనంతరం.. అమరవీరుడు జవాన్ భార్యకు భత్యాలతో సహా పెన్షన్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని