Coronavirus: మరో రెండేళ్లు అప్రమత్తంగా ఉండాలి!

రెండో దశ కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ పూర్తిగా విఫలమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌(ఐఐఎం-ఏ)లో ప్రముఖ ఆచార్యుడు చిన్మయ్‌ తుంబే తెలిపారు. దీనికి ఆయన రెండు కారణాలను ఎత్తిచూపారు..........

Published : 25 Apr 2021 20:17 IST

మహమ్మారి వ్యాప్తిపై ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌

దిల్లీ: రెండో దశ కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ పూర్తిగా విఫలమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌(ఐఐఎం-ఏ)లో ప్రముఖ ఆచార్యుడు చిన్మయ్‌ తుంబే తెలిపారు. దీనికి ఆయన రెండు కారణాలను ఎత్తిచూపారు. ఒకటి.. ప్రభుత్వంతో పాటు, ప్రజలు మహమ్మారిని తేలిగ్గా తీసుకున్నారని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని నెలల్లో వైరస్‌ పూర్తిగా నశించిపోతుందని అంతా భావించారన్నారు. ఇక కరోనా రకాలపై పెద్దగా దృష్టి సారించకపోవడం రెండో కారణమని తెలిపారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా తొలినాళ్లలో విస్తరించిన దానితో పోలిస్తే చాలా భిన్నమైందని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థను త్వరగా తెరవాలనుకోవడం భారత్ చేసిన తప్పిదమని తుంబే అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదిగా పునరుద్ధరించారని తెలిపారు. అలాగే కరోనా వ్యాప్తి వెనుక ఉన్న శాస్త్రీయతను కూడా పూర్తిగా విస్మరించారన్నారు. కుంభమేళా నిర్వహణే అందుకు నిదర్శనమన్నారు. మహమ్మారి ప్రమాదం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుమతించి ఉండాల్సింది కాదన్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్లతో సిద్ధంగా ఉండాల్సిందన్నారు. డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మహమ్మారి వ్యాప్తిపై నిర్లక్ష్యం తారస్థాయికి చేరిందన్నారు. 

ఈ మహమ్మారి కొన్ని వారాల్లో అంతరించి పోయేది కాదని.. దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. మరో రెండేళ్ల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. అప్పటి వరకు కరోనా మహమ్మారి అప్పుడప్పుడు పలు విడతల్లో విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు. అయితే, తాజా విజృంభణను అణచివేయడమే తక్షణ కర్తవ్యమని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆక్సిజన్‌, పడకలు, వెంటిలేటర్లతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పుడూ డిమాండ్‌ కంటే 20 రెట్ల అధిక ఆక్సిజన్‌ నిల్వల్ని ఉంచుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని