అమరావతి జిల్లాలో వీకెండ్‌ లాక్‌డౌన్‌! 

కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతండటంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వారాంతపు లాక్‌డౌన్‌.....

Published : 19 Feb 2021 01:10 IST

అమరావతి: కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతండటంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కలెక్టర్‌ శైలేష్‌ నావల్‌ ప్రకటించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు అన్ని మార్కెట్లు, ఇతర దుకాణ సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వారంతపు రోజులు మినహా  మిగతా రోజుల్లో హోటళ్లు, రెస్టారంట్లతో పాటు అన్ని దుకాణ సముదాయాలూ రాత్రి 8గంటల వరకే తెరిచి ఉంటాయన్నారు (గతంలో ఇవి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉండేవి). జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా విధించకూడదనుకుంటే.. ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. 

లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో అన్ని మార్కెట్లు, ఇతర సముదాయాలు మూసే ఉంటాయని తెలిపారు. స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇండోర్‌ క్రీడలకు సైతం అనుమతిలేదన్నారు. మత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 4787 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  హెచ్చరికలు జారీచేసిన విషయంతెలిసిందే. అయితే,  అమరావతి జిల్లాలో మంగళవారం 82 కొత్త కేసులు రాగా.. నిన్న 230 కొత్త కేసులు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని