Vaccine Mixing: రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా..?

కరోనా వ్యాక్సిన్‌ రెండు వేర్వేరు కంపెనీలకు చెందినవి తీసుకునే వారిలో దుష్ర్పభావాలు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

Updated : 13 May 2021 17:07 IST

నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చిన వేళ.. మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే, డిమాండ్‌కు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా తీసుకునే వారిలో దుష్ర్పభావాలు ఎక్కువగానే ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వీటివల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన రెండు డోసులను తీసుకున్న వారిలో స్వల్ప నుంచి ఓ మోస్తారుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలిడోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కంటే ఒక్కోసారి ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చని పేర్కొంది. రెండు టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ర్పభావాలు తరచుగా కనిపిస్తున్నాయని.. అయినప్పటికీ అవి త్వరగానే సమసిపోతున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని మిశ్రమ టీకా ప్రయోగాలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ మాథ్యూ స్నేప్‌ పేర్కొన్నారు.

830 వాలంటీర్లపై ప్రయోగాలు..

ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లలో రెండు మోతాదుల్లో తీసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు మోతాదుల్లో తీసుకోవడంపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను మొదటి డోసులో ఒకటి, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షిస్తోంది. ఇలా 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులను ఇచ్చింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలపై మొదలుపెట్టగా.. ఈ రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో ఇచ్చి ప్రయోగాలు చేసింది.

వేర్వేరు టీకాలతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ..

ఇలా రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా.. ఒకేరకమైనా టీకా రెండు డోసుల్లో తీసుకున్న వారితో పోలిస్తే రెండు వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. ఆస్ట్రాజెనెకా తొలి డోసు, ఫైజర్‌ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. రెండు డోసులు ఆస్ట్రాజెనెకా తీసుకున్నవారిలో కేవలం 10శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయి. ఇక ఫైజర్‌ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న 41 శాతం మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా.. ఫైజర్‌లో రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 21శాతం దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, ఇవి ఆసుపత్రుల్లో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. అయినప్పటికీ వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

టీకాలను మార్చి తీసుకోవద్దు..

ప్రపంచ వ్యాప్తంగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలూ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కూడా రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్‌ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్‌తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తులు రెండో డోసు ఇతర రాష్ట్రాలు/జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్‌ తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని