Rahul Gandhi: ఎముకలు కొరికే చలిలో టీ షర్ట్‌లా.. ఎందుకిలా? రాహుల్‌ సమాధానమిదే..?

గజగజ వణికిస్తోన్న దిల్లీ చలిలో కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీ షర్టే ధరిస్తున్నారు. దీనిపై ఆయన్ను కొందరు మరోమారు ప్రశ్నించారు. 

Published : 28 Dec 2022 12:45 IST

దిల్లీ: దిల్లీ వాసులు ఎముకలు కొరికే చలిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేవలం టీ షర్ట్ ధరించి భారత్‌ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. సోమవారం కూడా టీ షర్ట్‌ ధరించి మహాత్మాగాంధీ సహా మాజీ ప్రధానుల స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చలిలో కూడా ఎందుకు టీ షర్ట్‌లోనే కనిపిస్తున్నారంటూ తాజాగా రాహుల్‌కు మరోమారు ప్రశ్నలు ఎదురయ్యాయి.

అందుకు ఆయన సమాధానమిస్తూ..‘నాకు సాధ్యమైనంత కాలం నేను ఈ టీ షర్ట్‌ను ధరిస్తూనే ఉంటాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఆయనకు ఇదే తరహా ప్రశ్న ఎదురైంది. ఇంతటి చలిలో కూడా టీ షర్ట్‌లో ఎలా నడవగలుగుతున్నారనగా.. చలికాలంలో వెచ్చటి దుస్తులు కూడా కొనుక్కోలేని రైతులు, కార్మికులు, పేద పిల్లలను ఈ మాట ఎందుకు అడగరని రాహుల్‌ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను 2,800 కి.మీ నడిచానన్నారు. ఈ నేపథ్యంలో చలిలోనూ టీ-షర్ట్‌లో ఉండడం పెద్ద విషయమేమీ కాదన్నారు. రోజూ రైతులు, కార్మికులు, కూలీలు ఇలా యావత్‌ భారత్‌ నడుస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

దీనిపై ఇదివరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘శీతకాలం చలికంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేష వాతావరణం దేశంలో ఎక్కువగా ఉంది. దిల్లీలోని అననుకూల వాతావరణం మీద కంటే గాంధీ ఉక్కు సంకల్పం ఈ సమస్యలపైనే కేంద్రీకృతమైంది’ అని వ్యాఖ్యానించారు.

ఈ టీ షర్ట్ అంశంపై భాజపా తన విమర్శలు కొనసాగించింది. ‘నడుస్తున్నంతకాలం నడుపుతాం. కావాలనుకున్నప్పుడు ఆపుతాం. ఇదేంటి యువరాజు..?’ అని భాజపా నేత అమిత్‌ మాలవీయ ట్వీట్ చేశారు. సెప్టెంబర్‌ మొదలైన జోడో యాత్ర.. డిసెంబర్ 16కు వందరోజులు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం దిల్లీకి చేరుకున్న ఈ యాత్రకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారు. జనవరి మూడున తిరిగి ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు