Operation Trident: పాక్‌ కొరివితో తలగోక్కున్న వేళ ..!

భారత్‌ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్‌కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్‌ దేశాల పై ‘ఆపరేషన్‌ ఫోకస్‌’ పేరిట ఇజ్రాయెల్‌ యుద్ధ విమానలతో దాడిచేసి గెలవడాన్ని చూసి పాక్‌ ప్రేరణ పొందింది.

Published : 06 Dec 2021 01:44 IST

 పీడకలగా మిగిలిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్‌కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్‌ దేశాల పై ‘ఆపరేషన్‌ ఫోకస్‌’ పేరిట ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడిచేసి గెలవడాన్ని చూసిన పాక్‌ తాను కూడా అలానే భారత్‌ను ఓడించాలని కలలుగన్నది. అందుకోసం ప్రయత్నించే క్రమంలో కొరివితో తలగోక్కుంది. చివరికి ఏముంది అప్పుడే సర్వీసులో చేరిన భారత కొత్త నౌకలు కరాచీ నౌకాశ్రయాన్ని ధ్వంసం చేశాయి. ఆ దెబ్బ నుంచి యుద్ధంలో కోలుకోలేక పాక్‌ రెండు ముక్కలైంది. భారత నావికా దళం కరాచీపై చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’కు 50 ఏళ్లు నిన్నటితో పూర్తయ్యాయి..!

సోవియట్‌ హెచ్చరికను పెడచెవిన పెట్టి..!

1971 నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన సోవియట్‌ యూనియన్‌ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌ కనుక భారత్‌పై దాడి చేస్తే అది దానికి ఆత్మహత్యా సదృశంగా మారుతుందని పేర్కొంది. పాక్‌ ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌ సహా పలు ప్రాంతాల్లో భారత్‌పై దాడి చేయాలంటూ అతివాదులు ర్యాలీలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన భారత్‌ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. డిసెంబర్‌ 23న పాక్‌ అధ్యక్షుడు యాహ్యాఖాన్‌ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ ఫోకస్‌’ వలే డిసెంబర్‌ 3వ తేదీన  పాక్‌కు చెందిన 51 యుద్ధ విమానాలు మూడు దఫాలుగా భారత్‌లోని 11 వైమానిక స్థావరాలు, రాడార్‌ కేంద్రాలపై ముందస్తు దాడులు నిర్వహించాయి. దీనికి ‘ఆపరేషన్‌ ఛెంఘిజ్‌ఖాన్‌’ అని పేరుపెట్టారు.  పాక్‌ విమానాలు ఆగ్రా వరకు వచ్చాయి. మరోవైపు పాక్‌ సైన్యం కశ్మీర్‌ వద్ద భీకరమైన షెల్లింగ్‌ మొదలుపెట్టింది.  ఈ దాడుల సమయంలో భారత్‌ ప్రతిస్పందించి నాలుగు పాక్‌ విమానాలను కూల్చేసింది. ఆ రోజు సాయంత్రమే భారత ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధ ప్రకటన చేశారు. ఆ రోజు రాత్రే భారత యుద్ధవిమానాలు పాక్‌లోని లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. 

మిసైల్‌ బోట్లతో దాడికి వ్యూహం..!

భారత్‌ నావికాదళం పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. నాటి చీఫ్‌ అడ్మిరల్‌ నందకు కరాచీ పోర్టు నిర్మాణాలపై మంచి అవగాహన ఉంది. పాక్‌ వాయుసేన దాడి చేసిన మర్నాడే కరాచీపై దాడి చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా మిసైల్‌ బోట్లను ఇందుకు వాడాలనుకున్నారు. ఎందుకంటే అవి వేగంగా కదలడంతోపాటు.. ప్రమాదకరమైన నాలుగు స్టైక్స్‌ క్షిపణులను  కలిగిఉంటాయి. అంతేకాదు వాటిలో ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌మెజర్స్‌ కూడా అమర్చారు. డిసెంబర్‌ 4వ తేదీన రష్యా నుంచి కొత్తగా కొనుగోలు చేసిన విద్యుత్‌ శ్రేణికి చెందిన ఐఎన్‌ఎస్‌ నిపట్‌, నిర్ఘాత్‌, వీర్‌లను సిద్ధం చేశారు. వీటికి అండగా అర్నాల శ్రేణికి చెందిన కార్వెట్లు కిల్తన్‌, కట్చాల్‌, ట్యాంకర్‌ నౌక పుష్పక్‌లు రంగంలోకి దిగాయి. దీనికి ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ అని కోడ్‌నేమ్‌ పెట్టారు. డిసెంబర్‌ 4వ తేదీ పగటి వేళ కరాచీకి 250 నాటికల్స్‌ మైళ్ల దూరానికి భారత మిసైల్‌ బోట్లు చేరుకొన్నాయి. పాక్‌ గగనతల గస్తీని తప్పించుకొనేందుకు రహస్యంగా సంచరించాయి. పాక్‌ వైమానిక దాడిని అడ్డుకొనేందుకు వీలుగా రాత్రి కరాచీపై దాడి చేయాలని నిర్ణయించాయి. రాత్రి వేళ మళ్లీ కరాచీ దిశగా భారత నౌకలు పయనించాయి.

ద్వారకా మీద దాడికి ప్రతీకారం..!

1965 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో ‘పీఎన్‌ఎస్‌ ఖైబర్‌’ భారత్‌లోని ద్వారకాపై దాడి చేసింది. ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’లో ఈ నౌక తేలిగ్గా  దొరికిపోయి ధ్వంసమైంది. భారత నౌకలు కరాచీకి 70 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉండగా.. ‘పీఎన్‌ఎస్‌ ఖైబర్‌’ వాటిని గుర్తించింది. వెంటనే భారత్‌కు చెందిన ఐఎన్ఎస్‌ నిర్ఘాత్‌ రాత్రి 10.45 సమయంలో తొలి స్టైక్స్‌ క్షిపణిని ఖైబర్‌పై ప్రయోగించింది. దీని దెబ్బకు ఖైబర్‌  బాయిలర్‌ రూమ్‌ ధ్వంసమైంది. అయినా అది నీటిపై కనిపించడంతో నిర్ఘాత్‌ రెండో క్షిపణిని ప్రయోగించి మరో బాయిలర్‌ రూమ్‌ను ధ్వంసం చేసింది. ఫలితంగా ఖైబర్‌ 222 మంది నావికులతో సహా మునిగిపోయింది. 

మందుగుండు నౌకను ధ్వంసం చేసి..

పాక్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ కోసం సైగాన్‌ నుంచి ముందుగుండు, ఆయుధాలను తీసుకెళుతున్న మర్చెంట్‌ నౌక ‘వీనస్‌ ఛాలెంజర్‌’ను భారత్‌ లక్ష్యంగా చేసుకొంది. ఐఎన్‌ఎస్‌ నిపట్‌ రెండు క్షిపణులను ప్రయోగించడంతో ఈ నౌక నీటమునిగింది. 1971 యుద్ధంలో పాక్‌కు ఇది చావుదెబ్బతో సమానం. ఇక మూడో లక్ష్యంగా పాకిస్థాన్‌కు చెందిన సీ-క్లాస్‌ డెస్ట్రాయర్‌ పీఎన్‌ఎస్‌ షాజహాన్‌ను భారత నౌకలు గుల్ల చేశాయి. ఈ యుద్ధం తర్వాత దానిని తుక్కుగా మార్చేశారంటే ఎంతగా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. 

సమీపంలోని పాక్‌ మైన్‌స్వీపర్‌ నౌక పీఎన్‌ఎస్‌ ముహ్‌ఫిజ్‌పై భారత నౌక వీర్‌ ఒక స్టైక్స్‌ క్షిపణిని ప్రయోగించింది. నిమిషాల్లో అది మునిగిపోయి 33 మంది పాక్‌ నావికాదళ సిబ్బంది మరణించారు. 

మరోపక్క ఐఎన్‌ఎస్‌ నిపట్‌ కరాచీ రేవు దిశగా దూసుకుపోయింది. రేవుకు 14 నాటిక్‌ మైళ్ల దూరంలో ఆగింది. పాక్‌కు చెందిన కెమారీ  వ్యూహాత్మక చమురు నిల్వలపై ఇది ఒక క్షిపణిని ప్రయోగించాక ఆపరేషన్‌ ముగించి భారత నౌకలు వెనక్కి మళ్లాయి. తమ మిషన్‌ విజయవంతమైందనడానికి గుర్తుగా భారత నావికాదళాధికారులు ‘అంగార్‌’ అనే కోడ్‌ను వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ కోహ్లికి పంపారు. వాస్తవానికి అదే రోజు భారత యద్ధవిమానాలు కూడా కరాచీలోని చమురు నిల్వలపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఏ దళం దాడి వల్ల ఆ చమురు నిల్వలు దెబ్బతిన్నాయన్నదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. 

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ ట్రైడెంట్‌తో పాక్‌ వణికిపోయింది. ఆ కంగారులో ఏమి చేస్తున్నారో వారి సైనికాధికారులకే తెలియలేదు. పాక్‌కు చెందిన నిఘా విమానం డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున పీఎన్‌ఎస్‌ జుల్ఫీకర్‌ను భారత్‌కు చెందిన మిసైల్‌ బోట్‌గా భ్రమించి రిపోర్టును బేస్‌కు పంపింది. దీంతో పాక్‌ వాయుసేన దీనిని ధ్వంసం చేసేందుకు ఎఫ్‌-86 జెట్‌లను పంపింది. ఆ విమానాలు గుడ్డిగా పీఎన్‌ఎస్‌ జుల్ఫీకర్‌పై 900 రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురు పాక్‌ నావికులు  మృతి చెందారు. చివరకు అది పాక్‌కు చెందిన నౌకగా గుర్తించి దాడిని ఆపింది. ఈ వ్యవహారం మొత్తాన్ని భారత నావికాదళం రేడియో సిగ్నల్స్‌ సాయంతో మౌనంగా తెలుసుకొని నవ్వుకొంది. పాక్‌ వాయుసేనకు మిసైల్‌ బోట్‌కు- ఫ్రిగేట్‌కు కూడా తేడా తెలియకపోవడం వల్లే ఇది జరిగిందని తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని