కరోనా టీకా విపరిణామాలకు నష్టపరిహారం

కరోనా టీకాల వల్ల ప్రమాదకర విపరిణామాలు తలెత్తితే, పరిహారం చెల్లించేందుకు ఈ సంస్థ అంగీకరించింది.

Published : 23 Feb 2021 13:09 IST

ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

లండన్‌: అంతర్జాతీయ కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం ‘కొవాక్స్‌’ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ 92 దేశాల ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు టీకాల వల్ల ప్రమాదకర విపరిణామాలు తలెత్తితే, అందుకు పరిహారం చెల్లించేందుకు కూడా ఈ సంస్థ అంగీకరించింది. ఇది కొవిడ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలు కానున్న ఏకైక నష్ట పరిహార కార్యక్రమం అని సంస్థ వెల్లడించింది. దీంతో ఆయా ప్రభుత్వాలకు పెద్ద భారం తొలగినట్లయింది.

భారత్‌తో సహా పలు ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. సదరు పథకం ద్వారా టీకాలను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. వాటి వల్ల విపరిణామాలు సంభవించినప్పుడు ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయా ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం వాటికి ఊరటనిచ్చింది. దీనిని అనుసరించి కొవాక్స్‌ పథకం కింద టీకా తీసుకున్న వారిలో ఎక్కువగా విపరిణామాలు తలెత్తితే న్యాయస్థానం, ఫిర్యాదులు తదితర విధానాలతో నిమిత్తం లేకుండా అర్హులకు బేషరతుగా పరిహారం చెల్లిస్తారు. కొవిడ్‌ టీకా వల్ల ప్రమాదకర సైడ్‌ ఎఫెక్ట్‌ సంభవించడం నిజానికి చాలా అరుదని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.

కొవిడ్‌ టీకా పరిహారానికి సంబంధించిన దరఖాస్తులు మార్చి 31 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, ఈ వెసులుబాటు జూన్‌ 30, 2022 వరకు అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని