Brij Bhushan: కుస్తీ యోధుల ఆగ్రహ జ్వాల.. ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌..?

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ప్రముఖ రెజ్లర్లను నిరసనకు దిగారు. ఇంతకీ ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌?

Published : 19 Jan 2023 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI)లో నిరంకుశ పాలన, క్రీడాకారిణులపై లైంగిక వేధింపులను నిరసిస్తూ దేశ అగ్రశ్రేణి కుస్తీ యోధులు రోడ్డెక్కడం కలకలం సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)ను పదవి నుంచి తొలగించాలంటూ వారంతా దేశ రాజధానిలో ధర్నా చేపట్టారు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా బ్రిజ్‌ భూషణ్‌ పేరు వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఆయన ఎవరంటే..?

ఆరుసార్లు ఎంపీగా గెలిచి..

ఉత్తరప్రదేశ్‌ (UP) లోని గోండా జిల్లాలో జన్మించిన బ్రిజ్‌ భూషణ్‌కి(Brij Bhushan) చిన్నప్పటి నుంచే కుస్తీమీద ఆసక్తి ఎక్కువ అనంతరం  కుస్తీ  నేర్చుకున్నారు. యుక్త వయసులో పలు పోటీల్లో పాల్గొన్న ఆయన.. 1980ల్లో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రామజన్మభూమి ఉద్యమంలో భాజపా అగ్రనేత ఎల్‌.కే అడ్వాణీతో కలిసి విస్తృతంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. ఈ ఉద్యమంతో స్థానికంగా బ్రిజ్‌ భూషణ్‌ పేరు మార్మోగింది. దీంతో 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోండా నియోజకవర్గం నుంచి భాజపా (BJP) ఆయనకు టికెట్‌ ఇచ్చింది.

ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan) తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. కొన్ని కారణాలతో భాజపా నుంచి విడిపోయి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2009లో ఎస్పీ అభ్యర్థిగా కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ భాజపా గూటికి చేరిన ఆయన.. కైసర్‌ గంజ్‌ నుంచి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి గెలిచి.. భాజపాలో బలమైన నేతగా మారారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బ్రిజ్‌ భూషణ్‌ కూడా నిందితుడిగా ఉండగా.. 2020లో కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది.

దశాబ్దానికి పైగా అధ్యక్షుడిగా..

అలనాటి మల్ల యోధులు జనార్ధన్‌ సింగ్, రామ్‌ ఆస్రే, రామచంద్ర, గంగా ప్రసాద్‌ వంటి వారితో బ్రిజ్‌ భూషణ్‌కు సత్సంబంధాలున్నాయి. దీంతో 2011లో తొలిసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 12 ఏళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై.. వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

మూడు దశాబ్దాలుగా యూపీలో బలమైన రాజకీయ నేతగా కొనసాగుతున్న బ్రిజ్‌ భూషణ్‌కు ఆ రాష్ట్రంలో 50కి పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. సొంత రెజ్లింగ్‌ అకాడమీ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని