Rahul Gandhi: ఇప్పుడెవరిని నిందిస్తారు? నెహ్రూనా.. ప్రజలనా?.. ప్రధాని మోదీపై రాహుల్‌ విసుర్లు

దేశంలో విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘మోదీ గారు.. ఈ విద్యుత్‌ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూనా?...

Published : 01 May 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘మోదీ గారు.. ఈ విద్యుత్‌ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? లేదా ఏకంగా ప్రజలనేనా?’ అని ప్రశ్నిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ వాగ్దానాలు, ఉద్దేశాల మధ్య అసలు సంబంధం లేదని ఆరోపించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతామంటూ 2015లో.. బొగ్గు సంక్షోభానికి సంబంధించిన వార్తలు కనిపించడం లేదని 2017లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాల వీడియోను ఈ సందర్భంగా పోస్ట్‌ చేశారు. ప్రధాని గాల్లో కట్టిన మేడలు ఎగిరిపోయాయని ఎద్దేవా చేశారు. విద్వేషపు బుల్డోజర్లు నడపడం ఆపి, విద్యుత్‌ కర్మాగారాలు పనిచేసేలా చూడాలని హితవు పలికారు.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ పలు రాష్ట్రాలను విద్యుత్‌ సంక్షోభం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, హరియాణా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఇప్పటికే కరెంటు కోతలను మొదలుపెట్టాయి. ఇదే సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలన, నిర్వహణాపర లోపాలే.. ఈ సంక్షోభానికి దారితీశాయని కాంగ్రెస్ ఆరోపించింది. బొగ్గు సరఫరాకు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. మరోవైపు.. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్రం ప్రయాణికుల రైళ్లను రద్దు చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం.. భలే గొప్ప పరిష్కారం వెతికారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని