adenovirus: పశ్చిమబెంగాల్‌లో అడినోవైరస్‌ కలకలం.. ఐదుగురు చిన్నారుల మృతి!

అడినోవైరస్‌ (adenovirus) వ్యాప్తి పిల్లలో పెరుగుతోంది. ఇటీవల పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో వెలుగులోకి వచ్చిన వైద్యనివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

Published : 01 Mar 2023 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాష్ట్రంలోని పిల్లల్లో అడినోవైరస్‌ (adenovirus) వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా శ్వాసకోశ  సమస్యతో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో అడినో వైరస్‌ కేసులు ఎక్కువుతున్నాయంటూ వార్తలు వస్తున్న వేళ ఈ మరణాలు చోటుచేసుకోవడం అధికారులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, అడినో వైరస్‌ వల్లే చిన్నారులు మృతి చెందారా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే దానిపై వైద్యులు స్పష్టంగా చెప్పడం లేదు. రెండేళ్ల లోపు చిన్నారులపై అడినో వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని, రెండు నుంచి ఐదేళ్ల చిన్నారులపై మోస్తరుగా వైరస్‌ ప్రభావం ఉంటుందని చెప్పారు. మృతి చెందిన ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో చికిత్స పొందగా.. మిగతా ముగ్గురు  బీసీ రాయ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెడియాట్రిక్‌ సైన్సెస్‌లో చికిత్స పొందారు. ఐదుగురు చిన్నారులూ నిమోనియా బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.

చాపకింద నీరులాగా..

గత రెండు నెలలుగా కోల్‌కతాలోని చిన్నారుల్లో దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల  కేసులు చాలా పెరిగాయి. ఇక రెండేళ్లలోపు పసిపిల్లలో తీవ్రమైన గురకతో ఇబ్బంది పడ్డ కేసులు కూడా వచ్చాయి. వీరిలో కొందరిని వెంటిలేటర్లపై ఉంచి చికిత్సను అందించాల్సి వచ్చింది. గత డిసెంబర్‌ నుంచి దాదాపు 15 మంది పిల్లలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వైద్యుడు తెలిపారు. కాకపోతే దీనికి అడినోవైరస్సే కారణమన్న విషయం తేలలేదన్నారు. జనవరి మొదటి మూడువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌కు పంపారు. వీటిల్లో 33శాతం నమూనాల్లో అడినోవైరస్‌ (adenovirus)ను గుర్తించారు. 

రోగ నిరోధకశక్తి ముఖ్యం..

అడినో వైరస్‌ (adenovirus) సోకిన వారిలో స్వల్పంగా జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, పిల్లల్లో ఇది అత్యధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వైరస్‌ను తట్టుకోవడంలో వ్యక్తి రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని కోల్‌కతా స్కూల్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెడిసన్‌కు చెందిన వైరాలజిస్టు అమితావ్‌ నంద్యా వెల్లడించారు. కానీ, కొవిడ్‌ సోకిన తర్వాత చాలా మందిలో రోగనిరోధక శక్తి పడిపోయిందన్నారు. ‘‘అడినోవైరస్‌ ఎండమిక్‌ (ఎప్పటికీ కట్టడిచేయలేని స్థితి)గా మారడంతో మనం హెర్డ్‌ఇమ్యూనిటీని అభివృద్ధి చేసుకోవాలి. కానీ, కొవిడ్‌ మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసిందని నా అనుమానం. అందుకే సాధారణ జలుబు, ఫ్లూ కారణమయ్యే వైరస్‌ కూడా తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తోంది. చివరికి మలేరియా, డెంగ్యూ వంటివి కూడా తీవ్రంగా మారాయి. గన్యా జ్వరం సాధారణంగా సోకిన తర్వాత  ఐదు రోజలు ఉంటుంది.. ఇప్పుడది చాలా మందిలో వారాల తరబడి ఉంటోంది’’ అని చెప్పారు. ప్రస్తుతం లక్షణాల ఆధారంగానే అడినోవైరస్‌గా  అనుమానిస్తున్నా..అయితే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, పారాఇన్‌ఫ్లూయెంజా, రెనోవైరస్‌ లేదా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కూడా కావచ్చని చెప్పారు. 

ఐసోలేషన్‌ సూచిస్తున్న డాక్టర్లు..

ప్రస్తుతం సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషేన్‌లో ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో చేతులను తరచూ కడుక్కోని శుభ్రంగా ఉంచుకోమని చెబుతున్నారు. సొంత వైద్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. సుదీర్ఘకాలం లక్షణాలతో బాధపడటం ప్రమాదకరమన్నారు. గతంలో అడినోవైరస్‌ (adenovirus) సోకిన పిల్లలు కోలుకొన్న తర్వాత మళ్లీ తరచూ ఆనారోగ్యాల  బారిన పడుతున్నట్లు గమనించామన్నారు. గతంలో కరోనాబారినపడిన పెద్దలకు కూడా అడినోవైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉందని చెప్పారు. 

ఈ వైరస్‌ వ్యాప్తి పిల్లలో పెరగడంతో పీడియాట్రిక్‌ విభాగంపై తీవ్రమైన ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ వైద్యశాలల్లో పీఐసీయూల కొరత తీవ్రంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడిని ఓ డాక్టర్‌ వెల్లడించారు. వాస్తవానికి బ్లాక్‌ స్థాయి ఆసుపత్రుల్లో కనీసం మూడు పీడియాట్రిక్‌ ఐసీయూలు ఉండాలి. అదే రాష్ట్రస్థాయి జనరల్‌, జిల్లా స్థాయి జనరల్‌ ఆసుపత్రుల్లో ఆరు పీడియాట్రిక్‌ ఐసీయూలు అవసరం. ‘పీడియాట్రిక్‌ ఐసీయూలు అంటే కేవలం పరికరాలే కాదని.. ఆ విభాగంలో శిక్షణ పొందిన నర్సులు, నిపుణులు కూడా వస్తారు’’ అని అసోసియేషన్‌ ఫర్‌ హెల్త్‌ సర్వీస్‌ డాక్టర్స్‌ ప్రొఫెసర్‌ మానస్‌ గుమ్‌తా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు