Jairam Ramesh : మణిపుర్‌ వెళ్లేందుకు మోదీకి ఒక్కరోజు కూడా వీలు కాలేదా?: కాంగ్రెస్‌

మణిపుర్‌ వెళ్లేందుకు ప్రధాన మంత్రి మోదీకి ఒక్క రోజు సమయం కూడా దొరకడం లేదా?అని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.

Updated : 27 Sep 2023 11:37 IST

దిల్లీ : మణిపుర్‌లో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సమయం లేదంటూ కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) విమర్శలు గుప్పించారు. ‘మణిపుర్‌లో కల్లోలిత పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) ఒక్క రోజు సమయం కూడా ఎందుకు దొరకడం లేదో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయనకు మణిపుర్‌ (Manipur)ను సందర్శించే సమయం లేకపోవడం ఎంతో బాధాకరం. దేశంలో ఏం జరుగుతున్నా మోదీకి పట్టింపు లేదు. మణిపుర్‌ రాష్ట్రాన్ని విడిచిపెట్టారు. ప్రధానమంత్రి అధికారంలోకి రావాలని మాత్రమే ఆరాట పడుతున్నారు’ అని ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మండిపడ్డారు.

మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా మోదీపై విమర్శలు గుప్పించారు. ‘147 రోజులుగా మణిపుర్‌ ప్రజలు బాధపడుతున్నారు. కానీ ప్రధానికి మణిపుర్‌ రాష్ట్రాన్ని సందర్శించడానికి సమయం లేదు. మణిపుర్‌ హింసలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయానక ఫొటోలు మరోసారి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ గొడవలో మహిళలు, పిల్లలను హింసించడం ఆయుధంగా మారిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. అందమైన మణిపుర్‌ రణరంగంగా మారడానికి కారణం భాజపా. ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ (N Biren Singh) ను తొలగిస్తేనే అక్కడి హింసాకాండను ఆపేందుకు మొదటి అడుగు వేసినట్లు అవుతుంది ’ అని ఖర్గే పేర్కొన్నారు.

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur Violence)లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు.. సాయుధ మూకల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మంగళవారం నుంచి ఇంటర్నెట్‌ (Internet) సేవలను మరో ఐదురోజుల పాటు నిలిపివేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని