Ukraine Crisis: ఉక్రెయిన్‌ విషయంలో భారత్ వైఖరి సరైందేనా?

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నా భారత్‌ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పలు దేశాల నుంచి ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తోంది........

Published : 04 Mar 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం ఖండిస్తున్నా భారత్‌ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పలు దేశాల నుంచి ఒత్తిళ్లు, విజ్ఞప్తులు వచ్చినా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. మరి, రష్యా విషయంలో భారత్‌ సానుకూల దృక్పథంతో ఉండటానికి కారణమేంటి? రష్యా గతంలో మనకు అండగా నిలిచిన సందర్భాలేంటి? ఉక్రెయిన్‌తో మన మైత్రి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే..

శాంతి చర్చలతోనే పరిష్కారమంటోన్న భారత్‌

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం విషయంలో భారత్‌ ఆచితూచి అడుగులేస్తోంది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు, వినతులకు తలొగ్గకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే రష్యాకు వ్యతిరేకంగా ఐరాస చేసిన తీర్మానాలపై ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్‌ దూరంగా ఉంటోంది. మాస్కోతో ఉన్న చిరకాల స్నేహాన్ని చెదరనీయకుండా శాంతి చర్చలే  సమస్యకు పరిష్కారమని సూచిస్తోంది. దౌత్యమార్గాల ద్వారానే ఇరు దేశాలూ ప్రస్తుత పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలని హితవుపలుకుతోంది. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్రకు వ్యతిరేకంగా రష్యా, బెలారస్‌లపై అమెరికా మిత్రపక్షాలు ఐరాస భద్రతా మండలిలో తీర్మానాలను ప్రవేశపెట్టాయి. దీనికి సంబంధించి పలుమార్లు ఓటింగ్ నిర్వహించినా భారత్‌ ఏవైపూ మద్దతు తెలపకుండా తటస్థ వైఖరితో ఉంది. అమెరికాతో పాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటు వేయాలని, మాస్కోపై ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేసినా భారత్‌ దేశ ప్రయోజనాలకే కట్టుబడి నిర్ణయం తీసుకుంది.

రష్యాతో ఎప్పట్నుంచో మంచి సంబంధాలు

భారత్‌కు రష్యాతో ఎంతో కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సైనిక, ఆయుధ, వాణిజ్యంతో పాటు దౌత్య సంబంధాల విషయంలో చాలా ఏళ్లుగా భారత్‌కు రష్యా మంచి మిత్రదేశంగా ఉంది. భారత్‌కు అతిపెద్ద రక్షణ, ఆయుధ సామగ్రిని సరఫరా చేసే దేశంగా రష్యా నిలిచింది. రష్యా నుంచి ఫైటర్‌ జెట్‌లు, జలాంతర్గాములు, 1300లకు పైగా టీ90 యుద్ధ ట్యాంకులను భారత్‌ కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి అత్యాధునిక ఎస్‌-400 మిసైళ్లను భారత్‌ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 5బిలియన్‌ డాలర్లతో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 70శాతం ఆయుధాలను రష్యా నుంచే భారత్‌ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం వస్తోన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి రష్యాపై భారత్‌ ఆంక్షలు విధిస్తే రక్షణ పరికరాల నిర్వహణ కష్టతరమవుతుంది. ఈ ఆయుధాల నిర్వహణలో స్వదేశీ పరిజ్ఞానం సాధించాలంటే భారత్‌కు దశాబ్దాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ రష్యా విషయంలో అనుసరిస్తున్న వైఖరి మంచిదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 

ఏ యుద్ధంలోనూ మనకు అండగా నిలవని అమెరికా

ప్రస్తుతం ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ మద్దతు కోరుతున్న అమెరికా.. ఏ యుద్ధ సమయంలోనూ మనకు అండగా నిలవలేదు. 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందించింది. బంగాళాఖాతంలో ఓవైపు అమెరికాకు చెందిన యుద్ధనౌక 70 యుద్ధ విమానాలతోను, మరోవైపు అరేబియా సముద్రంలో బ్రిటన్‌కు చెందిన యుద్ధనౌక భారత్‌ను బెదిరింపులకు గురిచేశాయి. భారత్‌ విజ్ఞప్తితో ఈ యుద్ధ నౌకలు ముందుకు సాగకుండా రష్యా జలాంతర్గాములు అడ్డుకున్నాయి. పశ్చిమదేశాలు సైతం ఏ యుద్ధంలోనూ భారత్‌ తరఫున నిలబడిన దాఖలాల్లేవు. పైగా అణ్వస్త్రపరీక్షలు చేసినప్పుడూ ఇవి భారత్‌పై ఆంక్షలు విధించాయి. యుద్ధాన్ని నివారించాలంటే ఇరు దేశాలూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ, రష్యా చేస్తున్న డిమాండ్లను అమెరికాతో పాటు నాటో దళాలు తిరస్కరించడంతో దౌత్య చర్చలు అసంపూర్తిగా ముగుస్తున్నాయి. ఆపదలో ఉన్నప్పుడు భారత్‌కు ఏ దేశమూ అండగా నిలవలేదు. ప్రస్తుత సమయంలో ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకోవాల్సి ఉండగా.. భారత్‌ దానికే కట్టుబడి ఉండటం సరైందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆ రెండు దేశాలూ ఎప్పుడూ పాక్‌నే ఆదరించాయి!

దేశ విభజన వేళ బ్రిటన్‌ చర్యల ఫలితంగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఎడతెగని వివాదం సాగుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కారణంగా చైనాతో పాక్‌ సరిహద్దును పంచుకోవడంతో ఉపఖండంలో భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. భారత్‌కు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పాక్‌ను అమెరికా, బ్రిటన్‌ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నాయి. రెండు అమెరికా యుద్ధ నౌకలు పాక్‌ నావికాదళంతో కలిసి తాజాగా యుద్ధ విన్యాసాలు చేపట్టాయి.

ఐరాసలో భారత్‌కు మద్దతు ఇవ్వని ఉక్రెయిన్‌!

ఐరాసలో అవకాశం వచ్చిన ప్రతిసారీ ఉక్రెయిన్‌ భారత్‌ను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ని చేర్చుకుంటామని అమెరికా సహా పలు దేశాలు హామీ ఇచ్చాయి. కానీ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాతో కలిసి ఉన్నప్పటికీ యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్‌ ఇంకా పేద దేశంగానే ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని