Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?

విమానం (Flight) కాక్‌పిట్‌ (Cockpit)లో పైలట్లు (Pilots) ఆహారం (Food) తీసుకోవాలా? వద్దా? అనేది ఆయా విమానయాన సంస్థల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోరు.

Published : 20 Mar 2023 19:49 IST

దిల్లీ: కొద్దిరోజుల క్రితం హోలీ పండుగ రోజు  ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానం (Flight)లో ఇద్దరు పైలట్లు (Pilots) కాక్‌పిట్‌ (Cockpit)లో ఆహారం (Food) తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఆ ఘటనపై విచారణ చేపట్టిన విమానయాన సంస్థ యాజమాన్యం సదరు పైలట్లను రోజువారీ విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కమర్షియల్‌ విమాన పైలట్ల ఆహార నియమావళి గురించి నెట్టింట్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. పైలట్లు కాక్‌పిట్‌లో ఆహారం తీసుకోవచ్చా? విమానంలోని ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం ఎందుకు తీసుకోరు? పైలట్ల ఆహారానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA), ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) ఏం చెబుతుందో చూద్దాం. 

కాక్‌పిట్‌లో ఆహారం తీసుకోవచ్చా? 

కొన్ని విమానయానసంస్థల నిబంధనల ప్రకారం పైలట్లు విమానం కాక్‌పిట్‌లో ఆహారం తీసుకోకూడదు. కానీ, ఇతర విమానయాన సంస్థల పైలట్లు కాక్‌పిట్‌లో ఆహారం తీసుకోవచ్చు. అయితే, ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు అనేది నిబంధన. కొన్ని విమానాల్లో కాక్‌పిట్‌లో పైలట్లు ఆహారం తీసుకునేందుకు ట్రే ఉంటే, మరికొన్ని విమానాల్లో ప్రయాణికులతోపాటు సీటులో కూర్చొని తినాల్సిందే.  సాధారణంగా విమానం ఆటో పైలట్‌ మోడ్‌లో ఉన్నప్పుడు పైలట్లు ఆహారం తీసుకుంటారు. 

ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?

ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం తీసుకోకూడదు అనే దానికి సంబంధించి డీజీసీఏ, ఎఫ్‌ఏఏ ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. కానీ, ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదు అనే సంప్రదాయాన్ని విమానయాన రంగంలో చాలా ఏళ్లుగా పైలట్లు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఇద్దరు తిన్న ఆహారంతో వారికి అసౌకర్యం కలిగితే విమానం కంట్రోల్‌ తప్పుతుంది కాబట్టి, వేర్వేరు ఆహారం తీసుకోవాలనే సంప్రదాయాన్ని ప్రతి పైలట్‌ పాటిస్తుంటారు. కొన్ని విమానయాన సంస్థల్లో  పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం కావాలని కోరితే.. విమాన సిబ్బంది వారి అభ్యర్థనను తిరస్కరించవచ్చు. ఒకవేళ తప్పనిసరై తినాల్సి వస్తే.. పరిమిత మోతాదులో మాత్రమే వారికి ఆహారం అందిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని