Odisha Train Accident: ఆ హెచ్చరికలను ఎందుకు విస్మరించారు..? ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

రైలు ప్రమాదాలు, భద్రతకు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నాలుగు పేజీల లేఖ రాశారు.

Published : 05 Jun 2023 15:03 IST

దిల్లీ: రైల్వేలో ప్రమాదాలు, భద్రతా ప్రమాణాలకు (Safety Standards) సంబంధించి వచ్చిన అనేక హెచ్చరికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఈ ప్రమాదంపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయాలని రైల్వేమంత్రి చెప్పడంపై మండిపడిన ఆయన.. సురక్షితమైనవంటూ ఆయన చెబుతున్న వాదనలన్నీ వట్టివేనని తేలిందన్నారు. ఒడిశాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి (Odisha rail tragedy) వాస్తవ కారణాలను ఇకనైనా ప్రభుత్వం వెలుగులోని తీసుకురావాలని డిమాండు చేసిన ఖర్గే.. నేరాలపై దర్యాప్తు చేసే సీబీఐతో రైల్వే ప్రమాదంపై దర్యాప్తు చేయించడమేంటని ప్రశ్నించారు. రైలు ప్రమాదాలు, భద్రతకు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నాలుగు పేజీల లేఖ రాశారు.

సీబీఐతో దర్యాప్తు ఏంటీ..?

‘బాధ్యతాయుతమైన మీరు, రైల్వే మంత్రి.. రైల్వేశాఖలో సమస్యలు ఉన్నాయని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే ఈ ప్రమాదానికి మూల కారణాన్ని కనిపెట్టామని రైల్వే మంత్రి చెప్పారు. దర్యాప్తు చేయాలని మళ్లీ సీబీఐకి సూచించారు. సీబీఐ ఉన్నది నేరాలపై దర్యాప్తు చేయడానికి, అంతేకానీ, రైల్వే ప్రమాదాలపై విచారణ చేయడానికి కాదు. సీబీఐ లేదా మరే దర్యాప్తు సంస్థ కూడా సాంకేతిక, శాఖాపరమైన, రాజకీయ వైఫల్యాలను గుర్తించలేదు. దీనికితోడు రైల్వే భద్రత, సిగ్నలింగ్‌, నిర్వహణకు సంబంధించి వారికి సాంకేతికపరమైన నైపుణ్యాలు ఉండవు’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ దారుణ ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి, వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాగ్‌ నివేదికలను ఎందుకు పట్టించుకోలేదు..?

‘రైల్వేలో ఉన్నతస్థాయితోపాటు వివిధ కేటగిరీల్లో భారీసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ‘2017-18, 2020-21 మధ్యకాలంలో జరిగిన పది రైలు ప్రమాదాల్లో ఏడు కేవలం పట్టాలు తప్పడం వల్లేనని కాగ్‌ తాజా నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. ఈస్ట్‌ కోస్ట్‌లో ట్రాక్‌ నిర్వహణ ఊసే లేదు. కాగ్‌ చేసిన ఈ హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. అయినప్పటికీ ఈ విషాద సమయంలో దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందన్న ఆయన.. దేశంలో కోట్ల మంది ప్రయాణానికి కీలకమైన రైల్వేలపై మరింత విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని రైల్వే మార్గాల్లో భద్రతా ప్రమాణాలు, పరికరాలను అమర్చాలని ప్రధాని మోదీకి రాసిన సుదీర్ఘ లేఖ ద్వారా సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని