Rahul Gandhi: ఆ బంగ్లాలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి: లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాహుల్‌ రిప్లయ్‌

అనర్హత వేటు నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి నోటీసులు జారీ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ నేత స్పందించారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని బదులిచ్చారు.

Updated : 28 Mar 2023 14:52 IST

దిల్లీ: అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రాహుల్‌ మంగళవారం స్పందించారు. అధికారుల ఆదేశాలను తాను తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయ (Loksabha Secretariat) అధికారులు ఆయన లేఖ రాశారు. (Rahul Disqualification)

‘‘12- తుగ్లక్‌ లేన్‌లో నాకు కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయమంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ పంపిన లేఖ అందింది. అందుకు కృతజ్ఞతలు. ప్రజల తీర్పుతో నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నేను ఈ బంగ్లాలో ఉంటున్నాను. ఇక్కడ నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా..  లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అది నా బాధ్యత. బంగ్లాను ఖాళీ చేస్తా’’ అని రాహుల్‌ (Rahul Gandhi) తన లేఖలో వెల్లడించారు.

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని (Disqualification) రద్దు చేస్తూ ఇటీవల లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం.. నెల రోజుల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్‌ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనే రాహుల్‌ స్పందించారు. మరోవైపు, లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌కు ఉండే ప్రయోజనాలన్నింటినీ కూడా అధికారులు పునఃపరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని