ట్రంప్‌ నిషేధించినా ఆ వెబ్‌సైట్‌ నడిపిస్తాం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ‌ యాప్‌పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని టిక్‌టాక్‌ అమెరికా చీఫ్‌ వనెస్సా పప్పాస్‌ అంటున్నారు. టిక్‌టాక్‌పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్‌సైట్‌ ద్వారా ఆకట్టుకుంటామని అన్నట్టు సమాచారం. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను...

Published : 23 Aug 2020 02:37 IST

అమెరికా టిక్‌టాక్‌ ఛీప్‌ వనెస్సా పప్పాస్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ‌ యాప్‌పై నిషేధం విధించినా ఏదో ఒకదారిలో ప్రజలను అలరిస్తామని టిక్‌టాక్‌ అమెరికా చీఫ్‌ వనెస్సా పప్పాస్‌ అంటున్నారు. టిక్‌టాక్‌పై ఆధారపడ్డ అమెరికన్లను వెబ్‌సైట్‌ ద్వారా ఆకట్టుకుంటామని అన్నట్టు సమాచారం. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టేందుకు వారితో మాట్లాడుతున్నామని మీడియాకు చెప్పారు.

మూడేళ్లు చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం చేసిన సంగతి తెలిసిందే! ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఇబ్బందులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత సమస్యను పరిష్కరించుకొనేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ట్రంప్‌ దశల వారీగా ఆంక్షలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ రావడం, సమాచారాన్ని ఇవ్వకపోవడం, వైరస్‌ను నియంత్రించకపోవడతో డ్రాగన్‌ దేశంపై అందరికీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో గల్వాన్‌ లోయలో భారత సైనికులతో బాహాబాహీకి దిగడం దాని గౌరవాన్ని మరింత దిగజార్చింది.

చైనాను దారిలోకి తెచ్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ అనేక అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం బదిలీ అవుతుండటం, చైనా సర్వర్లలో నిక్షిప్తమవ్వడం, దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉండటంతో టిక్‌టాక్‌, హెలో సహా అనేక డ్రాగన్‌ యాప్‌లపై నిషేధం విధించారు. మోదీ బాటలోనే ట్రంప్‌ నడవాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అధ్యక్షుడికి లేఖ రాశారు. దీనిపై చర్చించిన ఆయన సెప్టెంబర్‌ 15లోపు టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులను అమెరికా సంస్థలకు బదిలీ చేయాలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. అవసరమైతే విశేష అధికారాలను ఉపయోగిస్తానని చెప్పారు. దీంతో మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నాయని వార్తలు వచ్చాయి.

‘ప్రతి రోజూ లక్షల మంది అమెరికన్లు మా యాప్‌పై ఆధారపడుతున్నారు. వారికి ఈ అద్భుతమైన యాప్‌ అనుభూతిని అందించేందుకు మాకు ఎన్నో దారులు ఉన్నాయని విశ్వసిస్తున్నాం’ అని టిక్‌టాక్‌ అమెరికా చీఫ్‌ పప్పాస్‌ అన్నారు. అమెరికాలో విదేశీ పెట్టుబడుల కమిటీ చేసిన ఆరోపణలపై తమకు ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నించగా ఆమె సమాధానం దాటవేశారు. ఉద్యోగులు ఆందోళన చెందకుండా నిత్యం మాట్లాడుతున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని