ట్రంప్‌ ‘ముప్పు’ను తొలగించుకుందాం!

అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంలో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన స్పీకర్‌ నాన్సీ పెలోసీ కఠినంగా ఉన్నారు........

Updated : 11 Jan 2021 12:18 IST

అభిశంసన ప్రక్రియ మొదలు పెట్టడానికి సిద్ధమైన డెమొక్రాట్లు

వాషింగ్టన్‌: అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంలో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన స్పీకర్‌ నాన్సీ పెలోసీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు సోమవారం సభలో అభిశంసన ప్రక్రియ మొదటుపెట్టాలంటూ సభ్యులకు ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ట్రంప్‌ అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా పరిణమించారంటూ పెలోసీ ఘాటు విమర్శలు చేశారు. వెంటనే తొలగించకపోతే మరింత ప్రమాదమని వ్యాఖ్యానించారు. ‘‘మన దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే మనం వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్‌ పెద్ద ముప్పుగా పరిణమించారు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ట్రంప్‌ ప్రేరేపిస్తున్న హింస తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది’’ అని పెలోసీ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు 25వ రాజ్యాంగ సవరణ కింద ట్రంప్‌ను తొలగించే అంశాన్ని పరిశీలించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరాలని డెమొక్రాటిక్‌ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సభలో తీర్మానం ప్రవేశపెట్టి.. సభ్యుల ఏకగ్రీవ మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా.. అభ్యంతరం తెలిపితే.. దీనిపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానాన్ని పెన్స్‌కు పంపి ఆయనకు 24 గంటల సమయం ఇచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ పెన్స్‌ అందుకు నిరాకరిస్తే.. సభలోనే అభిశంసన ప్రక్రియ మొదలపెడతామని పేలోసీ తేల్చి చెప్పారు. అభిశంసన తీర్మానంపై బుధవారం నాటికి ప్రతినిధుల సభలో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు. తర్వాత సెనేట్‌లో జరగాల్సిన విచారణకు దీన్ని పంపే అవకాశం ఉంది. అయితే, బైడెన్‌ కేబినెట్‌ను ఆమోదించడం వంటి ప్రక్రియల వల్ల అభిశంసన తీర్మానాన్ని స్వీకరించడంలో సెనేట్‌ జాప్యం చేసే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తీర్మానంపై చర్చను ప్రారంభిస్తే.. ఇక సెనేట్‌ ఇతర ఎటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం లేదు. అప్పుడు బైడెన్‌ కేబినెట్‌కు ఆమోదముద్ర పడే ప్రక్రియలో జాప్యం జరగవచ్చు. 

అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్‌ సభ్యుల మద్దతు కూడా ఉండడం గమనార్హం. క్యాపిటల్‌ భవనంపై దాడిని చాలా మంది రిపబ్లికన్లు కూడా అంగీకరించడం లేదు. ట్రంప్‌ తిరుగుబాటును ప్రోత్సహించారని ఆరోపిస్తూ దిగువ సభలో డెమొక్రాటిక్‌ పార్టీ సభా నాయకుడు డేవిడ్‌ సిసిలీన్‌ అభిశంసన తీర్మానాన్ని (‘ఇంపీచ్‌మెంట్‌ ఆర్టికల్స్‌’)ను రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలిపారు. బుధవారం దీనిపై ఓటింగ్‌ జరగనుంది. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు.

ఇవీ చదవండి..

అడకత్తెరలో ట్రంప్‌

ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని