Corona India : ఒక్కరోజే 1501 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు దేశవ్యాప్త కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15.66లక్షల టెస్టులు

Updated : 18 Apr 2021 11:36 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15.66లక్షల టెస్టులు చేయగా 2,61,500 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది. కొత్తగా 1,38,423 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643 చేరి .. ఆ శాతం 87.23కి తగ్గింది.

తాజాగా కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,501 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత భారత్‌లో ఇంత భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో ఇప్పటి వరకూ కొవిడ్‌తో  మరణించిన వారి సంఖ్య 1,77,150కు చేరింది. ఇక మరణాల రేటు 1.21శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 18,01,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో టీకా ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నిన్న మొత్తం 26.84 లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 12.26కోట్లు దాటింది. 

ఇక మహారాష్ట్ర, దిల్లీల్లో కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 67,123 కేసులు నమోదు కాగా.. 419 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో 24,375 కేసులు నమోదు కాగా, 167 మంది మృతి చెందారు. కేసులు పెరుగుతున్న తరుణంలో పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరాయి. దీనిపై ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ ఆయా రాష్ట్రాల మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు నిన్న ప్రధాని మోదీ సైతం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీకాలు ఉత్పత్తి పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ గరిష్ఠస్థాయిలో కొనసాగేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థల్ని వినియోగించుకోవాలని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని