Fertility: వైద్యుడి నిర్వాకం.. సొంత వీర్యంతో మహిళలకు గర్భం!

గర్భవతిని చేసేందుకు ఓ ఫర్టిలిటీ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా.. రహస్యంగా సొంత వీర్యాన్ని వినియోగించాడని అమెరికాకు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లెక్కారు....

Published : 16 Sep 2021 02:27 IST

న్యూయార్క్‌: గర్భవతిని చేసేందుకు ఓ ఫెర్టిలిటీ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా.. రహస్యంగా సొంత వీర్యాన్ని వినియోగించాడని అమెరికాకు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లెక్కారు. పలువురు మహిళలకు సైతం సొంత వీర్యాన్నే ఉపయోగించి గర్భం వచ్చేలా చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ మోరిస్ వోర్ట్​మన్ అనే వైద్యుడిపై న్యూయార్క్‌కు చెందిన మహిళ కేసు దాఖలు చేశారు.

1980లలో దాతల నుంచి సేకరించిన వీర్యంతో ఓ మహిళ గర్భం దాల్చారు. రోచెస్టర్​కు చెందిన మోరిస్ వోర్ట్​మన్ అనే వైద్యుడు ఆమెకు ఈ చికిత్స అందించి గర్భం దాల్చేలా చేశారు. స్థానిక వైద్య విద్యార్థి నుంచి సేకరించిన వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని ఆ వైద్యుడు తెలిపారు. అయితే, నిజానికి అది మోరిస్ సొంత వీర్యమేనని.. అప్పుడు జన్మించిన ఆ మహిళ కుమార్తె ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. దీనిపైనే కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం ఇదే వైద్యుడి వద్ద గైనకాలజీ చికిత్స తీసుకుంటున్నారు.

1985లో తాను జన్మించినట్లు పేర్కొంటున్న ఆ మహిళ.. డీఎన్ఏ జీనాలజీ (తమ వంశంలోని వ్యక్తులను గుర్తించేందుకు) పరీక్ష చేయించుకుంటే తనకు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నట్లు తేలిందని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై వైద్యుడు వోర్ట్​మన్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఆయన తరఫున మాట్లాడే న్యాయవాది వివరాలు సైతం వైద్యుడి కార్యాలయం వెల్లడించలేదు.

నిజానికి, గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇతరుల వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని చికిత్సలో ఉపయోగిస్తున్నారని కొందరు వైద్యులపై ఆరోపణలు వస్తున్నాయి. దాతల నుంచి సేకరించిన వీర్యం ద్వారానే చికిత్స అందిస్తున్నానని చెప్పిన ఇండియానాకు చెందిన వైద్యుడు డొనాల్డ్‌ క్లైన్‌ పదుల సంఖ్యలో మహిళలకు సొంత వీర్యాన్ని వినియోగించాడు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడి లైసెన్సును ఏడాది పాటు రద్దు చేసింది. నెవాడాలో జరిగిన ఇలాంటి ఉదంతంపై హెచ్​బీఓలో ‘బేబీ గాడ్’ అనే డాక్యుమెటరీ సైతం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని