H3N2 scare: హెచ్‌3ఎన్‌2 వైరస్‌ లక్షణాలతో మరొకరి మృతి!

హెచ్‌3ఎన్‌2 కేసులు కలవరపెడుతున్న వేళ ఈ వైరస్‌ లక్షణాలతో గుజరాత్‌లో ఓ మహిళ మృతిచెందారు. 

Published : 14 Mar 2023 16:28 IST

వడోదర: హాంగ్‌కాంగ్‌ ఫ్లూగా పేర్కొనే హెచ్‌3ఎన్‌2(H3N2) ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కలవరపెడుతోంది. ఈ వైరస్‌ లక్షణాలతో కర్ణాటకలో తొలి మరణం నమోదు కాగా.. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం వడోదరలోని  ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. మహిళ మరణానికి ప్రస్తుతం కలవరపెడుతోన్న  హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. వడోదరలోని ఫతేగంజ్‌కు చెందిన ఈ  మృతురాలికి సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించేందుకు రివ్యూ కమిటీకి పంపినట్టు తెలిపారు.  గుజరాత్‌లో గత వారం రోజుల క్రితం వరకు హెచ్‌3ఎన్‌2  కేసులు మూడు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రి హృషికేశ్‌ పటేల్‌ ఇటీవల వెల్లడించారు. మార్చి 10 వరకు గుజరాత్‌లో 80 సీజనల్‌ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. వాటిలో  77 ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌1ఎన్‌1 కేసులు కాగా.. మూడు హెచ్‌3ఎన్‌2 ఉపరకం కేసులే ఉన్నాయన్నారు. ఇంకోవైపు, ఈ ఫ్లూ లక్షణాలతో ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. 

ఇదిలా ఉండగా.. మార్చి నెలాఖరు నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు వైద్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి  ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇ టీవల తెలిపాయి.  జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని.. ఈ నెలాఖరు వరకు కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు.  హెచ్‌3ఎన్‌2, ఇతర ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్లు సీజనల్‌గా వచ్చేవనని.. ఈ కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకొనేందుకు కేంద్రం దృష్టిసారించింది. ఈ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వీయ మెడికేషన్‌,  యాంటీ బయోటిక్స్‌ వాడకాన్ని నివారించాలని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని