Air India: మూత్రవిసర్జన ఘటన.. శంకర్‌ ఆరోపణలన్నీ కల్పితమే..!

Air India : మూత్రవిసర్జన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు శంకర్ మిశ్రా చేసిన సంచలన వ్యాఖ్యలపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతడు కనీసం పశ్చాత్తాపం చెందకుండా.. తనను వేధించడానికే ఇలాంటి కల్పితాలను ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.

Published : 14 Jan 2023 11:55 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమానంలో మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా (Shankar Mishra).. కోర్టులో తన వాదనను మార్చేయడంపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.

తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, బహుశా ఆ మహిళే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుందని నిందితుడు శంకర్‌ మిశ్రా నిన్న కోర్టుకు వెల్లడించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా బాధితురాలు స్పందించారు. ‘‘నిందితుడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆ వ్యక్తి తన బెయిల్‌ దరఖాస్తులో పేర్కొన్న విషయాలు, కోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నేను అనుభవించిన ఇలాంటి భయానక అనుభవం మరొకరికి ఎదురవ్వకుండా సంస్థాగత మార్పులు చేపడతారనే ఉద్దేశంతోనే నేను ఈ ఫిర్యాదు చేశాను. ఆ వ్యక్తి తన అసహ్యకరమైన చర్యకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి.. బాధితురాలిని మరింత వేధించాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు’’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో గతవారం శంకర్‌ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడిని  పోలీసు కస్టడీకి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ నిరాకరించడంతో పోలీసులు సెషన్స్‌ కోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీల్‌పై కోర్టు నోటీసులు జారీ చేయగా.. నిందితుడు తన సమాధానాన్ని న్యాయస్థానానికి సమర్పించాడు.

సదరు మహిళ ప్రొస్టేట్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, అందువల్ల ఆవిడే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే అంతకుముందు ఈ వ్యవహారంలో తాను బాధితురాలికి నష్టపరిహారం ఇచ్చానని అంగీకరించిన శంకర్‌ మిశ్రా.. తాజాగా కోర్టులో తన వాదనను మార్చడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు