
వీడియో: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చూశారా?
న్యూదిల్లీ: 1315 మీటర్లు పొడవు.. 467 మీటర్ల ఆర్చ్.. రోజూ 500మంది వర్కర్లు.. 331 మీటర్ల ఎత్తులో పని.. 25 మెట్రిక్ టన్నుల బరువును మోసే సామర్థ్యం వెరసి ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ను నిర్మిస్తోంది భారతీయ రైల్వేస్.
జమ్మూ-కశ్మీర్లో చీనాబ్ నదిపై ఉదంపూర్-శ్రీనగర్-బారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో భాగంగా కొంకణ్ రైల్వేస్ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. తాజాగా ఈ బ్రిడ్జ్కు సంబంధించిన ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘భారత్దేశం గర్వించే సందర్భం. కశ్మీర్-కన్యాకుమారిలను కలిపే చీనాబ్ బ్రిడ్జ్ ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. 467 మీటర్ల పొడవైన ఆర్చ్ను కలిగిన ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైనది. ప్రధాని నరేంద్రమోదీ విజన్తో స్ఫూర్తి పొంది రైల్వే కుటుంబం భారత్ను అత్యున్నత శిఖరాల్లో నిలబెట్టింది’ అని ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఏడాదిలోపే ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని కొంకణ్ రైల్వేస్ ఛైర్మన్, ఎండీ, సంజయ్ గుప్తా తెలిపారు
చీనాబ్ వంతెన ప్రత్యేకతలు
* 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ప్రాంతంలో గాలి వేగం అధికంగా ఉండటంతో భద్రత దృష్ట్యా 2008-09 కాలంలో పనులు నిలిచిపోయాయి.
* పారిస్లోని ఇంజినీరింగ్ అద్భుతమైన ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
* 2017 నుంచి వంతెనకు స్టీల్ ఆర్చ్ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
* ఈ బ్రిడ్జ్ ద్వారా కశ్మీర్ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చు.
* బ్రిడ్జ్ పూర్తి పొడవు 1315 మీటర్లు
* చీనాబ్ నదిని దాటేందుకు నిర్మించిన ఆర్చ్ పొడవు 467 మీటర్లు
* నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తు
* చీనాబ్ నదిపై బ్రిడ్జ్ నిర్మించిన ప్రాంతంలో అత్యధికంగా గాలులు వీస్తాయి. 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజూ 500లకు పైగా కార్మికులు పనిచేసేవారు.
* బ్రిడ్జ్ నిర్మాణానికి కావాల్సిన పరికరాలన్నీ ముందుగానే తయారు చేసుకుని ఆ తర్వాత క్రేన్ల సాయంతో పైకి తీసుకెళ్లేవారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.