Yogi Adityanath: పోలీసులకు ముఖ్యమంత్రి సీరియస్‌ వార్నింగ్!

 తీవ్రమైన నేరాల్లో జోక్యం ఉన్నట్టు తేలితే అలాంటి పోలీసులను డిస్మిస్‌ చేస్తామని సీఎం హెచ్చరించారు.

Published : 01 Oct 2021 01:50 IST

లఖ్‌నవూ: పోలీసులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. తీవ్రమైన నేరాల్లో జోక్యం ఉన్నట్టు తేలితే అలాంటి పోలీసులను డిస్మిస్‌ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి గోరఖ్‌పూర్‌లో పోలీసుల దాడిలో మృతిచెందడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం సృష్టించింది. శాంతిభద్రత తీరుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీఎం స్పందించారు.  పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమైన యోగి.. ఇటీవలి కాలంలో కొందరు పోలీసుల అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలాంటి వ్యక్తులకు పోలీస్‌ శాఖలో స్థానం లేదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి పోలీసులను గుర్తించి ఆధారాలతో సహా జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కళంకిత సిబ్బందికి కీలక పోస్టింగ్‌ల్లో కూడా నియమించరాదని నొక్కి చెప్పారు. 

ఆ వ్యాపారి భార్యకు ప్రభుత్వోద్యగం.. సీఎం హామీ

మరోవైపు, హోటల్‌లో మృతిచెందిన వ్యాపారి కుటుంబాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరామర్శించారు. ఆ వ్యాపారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆ కుటుంబానికి రూ.10లక్షలు సాయం అందజేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. 

వ్యాపారి మృతి ఘటనపై విపక్ష పార్టీలు సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కాన్పూర్‌కు వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులను కలిశారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపితేనే న్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు, బీఎస్పీ అధినేత్రి మాయావతి సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ వ్యాపారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గోరఖ్‌పూర్‌ హోటల్‌లో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిపై హత్య కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని