
Zika Virus: యూపీని కలవరపెడుతోన్న జికా వైరస్.. 66కు పెరిగిన కేసులు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అక్కడ మరో 30 మందికి ఈ వైరస్ సోకడంతో కాన్పూర్లో మొత్తం జికా కేసుల సంఖ్య 66కు పెరిగింది. వీరిలో 45 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కాన్పూర్లో అక్టోబరు 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా వైరస్ బారినపడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టి వారి రక్తనమూనాలను పరీక్షించారు. ఐఏఎఫ్ స్టేషన్ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా పరీక్షలు చేశారు. వీరిలో ఇప్పటివరకు 66 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆశా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నారు. వీధుల్లో శానిటైజేషన్, యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.