Vaccine: త్వరలో అందుబాటులోకి జైకోవ్‌-డి   

కరోనా కోరలు తుంచేసేందుకు విస్తృత టీకాలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతులకు

Updated : 01 Jul 2021 14:26 IST

అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ దరఖాస్తు

దిల్లీ: కరోనా కోరలు తుంచేసేందుకు విస్తృత టీకాలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అతి త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశీయ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌ - డి’ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం కంపెనీ గురువారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. 

గుజరాత్‌ కేంద్రంగా ఉన్న జైడస్‌ క్యాడిలా సంస్థ కరోనాను ఎదుర్కొనేందుకు డీఎన్‌ఏ సాంకేతికతతో ‘జైకోవ్‌-డి’ టీకాను తయారుచేసింది. ఇది మూడు డోసుల టీకా. ఇటీవలే 28వేల మందిపై మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి. మూడో దశలో 12-18 ఏళ్ల వయసున్న 1000 మందిపై కూడా ఈ టీకాను ప్రయోగించారు. ఈ ప్రయోగాల ఫలితాలతో నేడు డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. 12ఏళ్లు అంతకంటే పైబడిన వారికి ఈ టీకా అందించేలా వినియోగ అనుమతులు ఇవ్వాలని కోరింది. అత్యవసర అనుమతులు లభించిన తర్వాత ఏడాదికి 12కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. 

జైకోవ్‌-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. అంతేగాక, దేశంలో అందుబాటులోకి వచ్చే ఐదో టీకా కానుంది. 12-18 ఏళ్ల వారికి అందుబాటులోకి వచ్చే తొలి టీకా కూడా ఇదే కానుంది. ఇప్పటికే స్వదేశీ టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉండగా.. ఇటీవలే మోడెర్నా టీకాకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దేశీయ ఫార్మా సంస్థ సిప్లా మోడెర్నా టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని