
AndhraPradesh News: రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు
విజయవాడ: ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘రాయలసీమ రతనాల సీమ’ అనే పదం తన హృదయంలో పదిలమన్న సోము.. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం రాయలసీమ ప్రాంత వాసులకు తెలుసన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చాలా సార్లు ప్రస్తావించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భాజపా ఆలోచన అని సోము వీర్రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘రాయలసీమలో ఎయిర్పోర్ట్.. కడపలో ఎయిర్పోర్ట్.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు..’ అని సోము వీర్రాజు గురువారం వ్యాఖ్యానించారు. దీనిపై అధికార వైకాపాకు చెందిన రాయలసీమ ప్రాంత నేతలతో పాటు వామపక్ష రాష్ట్ర నేతలూ తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమ ప్రజల సంస్కృతిని కించపరిచేలా సోము వ్యాఖ్యలు ఉన్నాయని ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.