
China PLA: అరుణాచల్ యువకుడిని అప్పగించిన చైనా.. కేంద్ర మంత్రి ట్వీట్
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్ను చైనా సైన్యం అపహరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున దుమారం రేగడంతో.. చైనా బలగాలతో హాట్లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆ యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు పీఎల్ఏ గత ఆదివారం తెలిపింది. తాజాగా గురువారం అతన్ని భారత సైన్యానికి అప్పగించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు ట్వీట్ చేశారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇతర ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు తెలిపారు.
అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనా పీఎల్ఏ బలగాలు అపహరించినట్లు అరుణాచల్ తూర్పు ఎంపీ తాపిర్ గావ్ తొలుత వెల్లడించిన విషయం తెలిసిందే. మిరామ్ వెంటే ఉన్న అతని స్నేహితుడు జానీ యాయింగ్ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఆయన ట్వీట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను ‘అదృశ్యం’గా పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సరిహద్దుల్లో మూలికలు సేకరణతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో చైనా బలగాలతో సంప్రదింపులు జరిపి తాజాగా అతన్ని స్వదేశానికి రప్పించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.