
కలెక్టరు పేరు మీద రూ. 2 కోట్ల వీలునామా
అది.. కలెక్టర్ కార్యాలయం.. మధ్యాహ్న సమయం.. సరిగ్గా అప్పుడే ఓ వృద్ధుడు అక్కడికి చేరుకున్నాడు. నేరుగా కలెక్టర్ గదిలోకి వెళ్లి.. తన రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను బయటకు తీసి, ‘ఈ ఆస్తి మీదే’ అంటూ కలెక్టర్కు అందించడం చూసి.. ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైంది. ఉత్తర్ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆగ్రాలోని నీరాలబాద్ పీపల్ మండి ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల గణేశ్ శంకర్ పాండే... సోదరులతో విడిపోయాక తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టు 4న ఆగ్రా కలెక్టర్ పేరు మీద వీలునామా రాశారు. ఈ పత్రాలను కలెక్టర్కు అప్పగించేందుకు ఇప్పుడు వచ్చారు. తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తరిమేశారని గణేశ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్, అజయ్ల వద్ద తాను ఉంటున్నానని చెప్పారు. తన ఇద్దరు కుమారులు తనను పట్టించుకోకుండా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఆస్తిని.. కలెక్టర్ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.