అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా నెగెటివ్ 

కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు.

Published : 08 Aug 2020 16:30 IST

 

ముంబయి: కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలినట్లు శనివారం ఆయన ట్విటర్ వేదికగా  వెల్లడించారు. బచ్చన్‌ కుటుంబంలో జయా బచ్చన్ మినహా, అమితాబ్ బచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్య అందరూ వైరస్‌ బారిన పడ్డారు. అయితే  కొన్నిరోజుల చికిత్స అనంతరం వారు వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. కానీ అభిషేక్ రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో ఇంకా కొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

తాజాగా తనకు నెగెటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడిస్తూ..‘నేను కరోనాను జయిస్తానని చెప్పాను కదా! అందుకు తగ్గట్టే ఈ రోజు పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. మా కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించిన అందరికి  కృతజ్ఞతలు. నేను కరోనాపై పోరాడటానికి సహకరించిన నానావతి వైద్యులు, నర్సుల మేలు మరువలేనిది’ అని అభిషేక్ ట్వీట్ చేశారు. తన కేర్ బోర్డు చిత్రాన్ని షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తన డిశ్చార్జి ప్లాన్‌: యస్‌ అంటూ రాసుకొచ్చారు. ఆగస్టు 2నే ఇంటికి  చేరిన బిగ్‌బీ తన కుమారుడు అభిషేక్  ఆసుపత్రిలో ఉండటం బాధిస్తుందంటూ కొద్దిరోజుల క్రితం తన బ్లాగులో వెల్లడిస్తూ వాపోయిన విషయం తెలిసిందే.  

 

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని