నటుడు అర్జున్‌ కుమార్తెకు సోకిన కరోనా

కుమార్తె ఐశ్వర్యతో సహా నటుడు అర్జున్‌ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. 

Updated : 21 Jul 2020 15:28 IST

కుమార్తెతో సహా పలువురికి కొవిడ్‌!

చెన్నై: తెలుగుతో సహా పలు దక్షణ భారతీయ సినిమాలలో నటించిన నటుడు అర్జున్‌ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌కు కరోనా వైరస్‌ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కొవిడ్‌-19 వ్యాధి సోకినట్టు ఇటీవలే నిర్ధారణ అయింది. వైద్య నిపుణుల సలహాతో నేను హోం క్వారంటైన్‌లో ఉంటున్నాను. ఇటీవలి కాలంలో నా సమీపంలోకి వచ్చిన వారు దయచేసి జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను.’’ అని ఆమె ప్రకటించారు. ఇక అర్జున్‌ మేనల్లుడు ధృవ సర్జా, అయన భార్య ప్రేరణకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ధృవ, ఇటీవల మృతి చెందిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సోదరుడు. ఈయన, రశ్మిక మందన కలసి నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’ మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. 

ఐశ్వర్య ఈ సంగతిని బహిరంగంగా వెల్లడించటం, తోటివారిని జాగ్రత్త పరచటం ద్వారా ఆమె కరోనా వ్యాప్తి నివారణకు తన వంతు బాధ్యత నిర్వర్తించారని పలువురు ప్రశంసించారు. ఐశ్వర్య  ‘పట్టత్తు యానాయి’ అనే చిత్రంతో తమిళంలో అరంగేట్రం చేశారు. కాగా ఆమె చివరిగా 2018లో కన్నడ చిత్రం ‘ప్రేమ బరాహ’లో తెరపై కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్‌ స్వయంగా రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని