కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య.. ఆరాధ్య

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఎటు నుంచి

Updated : 28 Jul 2020 10:13 IST

ముంబయి: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఎటు నుంచి ఏ రూపంలో సోకుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇటీవల బిగ్‌బి అమితాబ్‌ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన పరీక్షల్లో ఐశ్వర్యారాయ్‌, ఆరాధ్యలకు నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ఐశ్వర్య భర్త అభిషేక్‌ బచ్చన్‌ వెల్లడించారు.

‘‘మా కోసం మీరు చేసిన ప్రార్ధనలకు ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది. తాజాగా ఐశ్వర్య, ఆరాధ్యలకు చేసిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. ఇద్దర్నీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం వారు ఇంట్లో ఉన్నారు. నేను, నా తండ్రి ఇద్దరం ఇంకా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాం’’ -ట్విటర్లో అభిషేక్‌ బచ్చన్‌

అమితాబ్‌ కుటుంబంలో జయాబచ్చన్‌ ఒక్కరే సురక్షితంగా ఉన్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ తన అనుభవాలను బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘‘రాత్రిపూట  ఒంటరిగా ఉన్న నేను గదిలో చలికి వణికిపోయాను. అప్పుడే నిద్ర కోసం కళ్లు మూసుకొని చీకటి రాత్రిలో పాటలు పాడాను. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. కొవిడ్‌ రోగులు రోజుల తరబడి మనిషినే చూడరు. దీంతో వారి మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఐసోలేషన్‌ వార్డులో ఒంటరిగా ఉన్న రోగిని చూసేందుకు ఏ ఒక్క మనిషీ రాడు. డాక్టర్లు, నర్సులు వచ్చినా పీపీఈ కిట్లు ధరించే ఉంటారు. వారి ముఖాలు కనిపించవు. వాళ్లను చూస్తే రోబోల్లానే అనిపిస్తుంది. వారు మనకు ఏం కావాలో అది ఇచ్చేసి వెళ్లిపోతారు. చికిత్స అందిస్తూ పర్యవేక్షించే వైద్యుడు రోగి దగ్గరకు వచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించరు. వీడియో కాల్‌లోనే మాట్లాడతారు. అయితే ఇదే ప్రస్తుత పరిస్థితిలో ఉత్తమమైంది. ఈ వ్యాధి వైద్యరంగానికి ఓ సవాల్‌గా మారింది. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు... మొత్తం ప్రపంచం అంతా ఇదే  పరిస్థితి’’అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని