సుశాంత్ కేసు: రియాపై సీబీఐ ఎఫ్ఐఆర్  

సినీ వర్గాలతో పాటు, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది...

Published : 07 Aug 2020 02:54 IST

ముంబయి: సినీ వర్గాలతో పాటు, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో పాటు శామ్యూల్‌ మిరంద, శ్రుతి మోదీ అనే మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు బిహార్‌ పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

తన కొడుకు మృతికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి గత నెలలో పట్నా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సిఫారసు చేశారు. బిహార్‌ ప్రభుత్వ అభ్యర్థనను అంగీరిస్తూ కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ముందునుంచి మహారాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.     

మరోవైపు సుశాంత్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణంలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతాల నుంచి రియా చక్రవర్తికి రూ. 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఆరా తీస్తోంది. ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని