అదే మా మధ్య జరిగిన ఆఖరి సంభాషణ: చిరు

ప్రముఖ నృత్యకారిణి డాక్టర్‌ శోభానాయుడు మరణం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. కళాకారిణితో జరిగిన చివరి సంభాషణను గుర్తు.....

Published : 15 Oct 2020 01:14 IST

హైదరాబాద్‌: ప్రముఖ నృత్యకారిణి డాక్టర్‌ శోభానాయుడు మరణం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. కళాకారిణితో జరిగిన చివరి సంభాషణను గుర్తు చేసుకున్నారు. ‘‘ఉదయం శోభానాయుడు మరణవార్త వినగానే నిర్ఘాంతపోయా. ఆమె గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఆ స్థాయి కళాకారులు మళ్లీ వస్తారా అనేది ప్రశ్నే. వెంపటి చిన సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా కూచిపూడి నృత్య కళకు కీర్తి తీసుకొచ్చారు. ఆమెతో నాకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరినొకరం అభిమానించుకుని.. ప్రశంసించుకునేవాళ్లం.

ఈ మధ్య ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశా. ఆమె ఆరోగ్యం బాగోలేకపోయినా.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నృత్యం చేశారు. ఆమెకున్న అంకితభావాన్ని అర్థం చేసుకుని.. సంగీత దర్శకుడు కోటి ద్వారా నా శుభాకాంక్షలు తెలిపా. ఆమె కూడా నాకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. అదే మా ఇద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ. ఈ గడ్డు కాలం (కరోనా) అయిపోయాక తాను చేయబోయే ప్రదర్శనకు నన్ను, కోటిని ఆహ్వానించారు. వస్తానని చెప్పా. అలాంటి శోభానాయుడు ఈరోజు మనతో లేకపోవడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని