నేను అమాయకురాలిని: రియా చక్రవర్తి

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టైన సదరు హీరో ప్రేయసి, నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ రేపటికి వాయిదా పడింది. అక్టోబర్‌ 6వ తేదీవరకూ రియా చక్రవర్తికి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే..

Published : 23 Sep 2020 14:50 IST

రేపటికి వాయిదా పడిన బెయిల్‌ పిటిషన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ రేపటికి వాయిదా పడింది. అక్టోబర్‌ 6వ తేదీవరకూ రియా చక్రవర్తికి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్‌ కోసం బొంబాయి హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. ముంబయిలో భారీగా వర్షాలు పడుతోన్న నేపథ్యంలో హైకోర్టు విచారణలను గురువారానికి వాయిదా వేసింది.

తాను అమాయకురాలినని, ఎన్సీబీ బృందం ఉద్దేశపూర్వకంగానే తనతోపాటు తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని రియా చక్రవర్తి తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాల విచారణ కారణంగా ఇప్పటికే తన మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా మారిందని పిటిషన్‌లో ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను పరిచయం కాకముందు నుంచే సుశాంత్‌కి డ్రగ్స్‌ అలవాటు ఉందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే సుశాంత్‌కి తాను మాదకద్రవ్యాలు అందించానని, అది కూడా తన సొంతడబ్బుతో కొనుగోలు చేశానని బెయిల్‌ పిటిషన్‌లో రియా వెల్లడించారు.

స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బిహార్‌ డీజీపీ

సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు విచారణలో భాగంగా సోషల్‌మీడియా వేదికగా ముంబయి పోలీసులపై పలు వ్యాఖ్యలు చేసిన బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకే ఆయన పదవీ విరమణ చేసినట్లు సమాచారం. దీంతో రియా చక్రవర్తి తరఫు న్యాయవాది ‘సుశాంత్‌ సింగ్ రాజ్‌పూత్‌కి ఎలాంటి న్యాయం జరగలేదు కానీ, గుప్తేశ్వర్‌ పాండేకి మాత్రం న్యాయం జరిగింది’ అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గుప్తేశ్వర్‌ పాండే మీడియాతో మాట్లాడారు. ‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసు విచారణకు, నా రిటైర్‌మెంట్‌కు ఎలాంటి సంబంధం లేదు. న్యాయానికి అనుగుణంగానే నేను నడుచుకుంటాను. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అలాగే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లోకి వెళ్లకుండా సామాజిక సేవ చేయగలను’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని