అమితాబ్‌జీ.. ఎందుకలా చేశారు

కౌన్‌ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌లో అమితాబ్‌ ఓ అనూహ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

Published : 05 Nov 2020 01:05 IST

మీరంటే నాకిష్టం లేదన్న కేబీసీ పోటీదారు

 

ఇంటర్నెట్‌ డెస్క్: సూపర్‌ స్టార్‌గా, యాంగ్రీ యంగ్‌ మేన్‌గా నటుడు అమితాబ్ బచ్చన్‌ నాటి బాలీవుడ్ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం సీనియర్‌ నటుడిగా కీలక పాత్రలకు జీవం పోస్తున్నారు. ఇక ఈయన నిర్వహిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోగా నిలిచింది. అయితే కేబీసీ 12వ సీజన్‌లో ఆయన ఓ అనూహ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అమితాబ్‌ దా అంటే తనకు ఇష్టం లేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి తెలిపింది. అందుకు గల విచిత్రమైన కారణాన్ని కూడా ఆమె వివరించింది.

దిల్లీకి చెందిన రేఖారాణి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమౌతున్నారు. ఇటీవల కేబీసీ 12 లో పాల్గొన్న ఈ యువతి తాను షారుక్‌ఖాన్‌ కు పెద్ద అభిమానినని వెల్లడించారు. అంతవరకే బాగానే ఉన్న సంభాషణ.. అమితాబ్‌ అంటే తనకు ఇష్టం లేదని రేఖ చెప్పడంతో షాక్‌ తినడం ఆయన వంతయింది. పలు సినిమాల్లో తన అభిమాన నటుడు షారుక్‌తో అమితాబ్‌ దురుసుగా ప్రవర్తించారని.. ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’లో అయితే ఏకంగా ఇంటి నుంచి బయటకు పంపేశారని ఆమె ఆరోపించటంతో ఎలా స్పందించాలో తెలియక అమితాబ్‌ ఒక్క క్షణం మౌనం వహించారు. అదంతా కేవలం నటనే అని, స్కిప్టు ప్రకారమే అలా చేయాల్సివచ్చిందని చెప్పినా రేఖ అంగీకరించకపోవటంతో.. చివరికి ఆమెకు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా షారుక్‌కు కూడా సారీ చెపుతానంటూ వాగ్దానం చేశారు.

సినిమాల ప్రభావం జీవితంపై ఉంటుదన్న మాట నిజమే. ఇక సినిమాలో జరిగే సంఘటనలను నిజ జీవిత ఘటనలుగా అభిమానులు భావించటం కూడా సహజమే. అయితే.. తమ నటనను నిజమని నమ్మేంత అభిమానం ఎదురైనపుడు నటులు సంభ్రమానికి గురౌతారు. ఇదే మాదిరిగా షారుక్‌ చిన్న కుమారుడు అబ్‌రామ్‌ తనను తాతగా భావిస్తాడని గతంలో అమితాబ్‌ పలుమార్లు తెలిపారు. అంతేకాకుండా అమితాబ్‌ తమతో కలసి ఎందుకు ఉండడం లేదని కూడా ఆ చిన్నారి తరచు ప్రశ్నిస్తాడట.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని