‘కేజీఎఫ్‌2’ నుంచి కొత్త అప్‌డేట్‌ 

భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌:2’ ఒకటి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబు కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. తాజాగా షూటింగ్‌లకు

Published : 24 Aug 2020 00:28 IST

హైదరాబాద్‌: భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌:2’ ఒకటి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబు కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతులు రావడంతో చిత్ర బృందం మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయడానికి సన్నద్ధమవుతోంది.

‘‘ఆగస్టు 26 నుంచి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో కేజీఎఫ్‌ చాప్టర్‌2 షూటింగ్‌ మొదలు కానుంది. క్లైమాక్స్‌ ఫైట్‌ మినహా పూర్తి షూటింగ్‌ 10రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం’’ అని సినిమా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కార్తీక గౌడ చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో చిత్రీకరణకు హాజరయ్యే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక సిబ్బందితో సహా అందరినీ దగ్గర్లోని హోటల్‌లో ఉంచుతామని, షూటింగ్‌ పూర్తయ్యే వరకూ ఎవరినీ బయటకు పంపించబోమని వెల్లడించారు.

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక.  ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

చాప్టర్‌-1లో అనేక ప్రశ్నలకు పార్ట్‌-2లో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ చనిపోయిన వార్త తెలిసిన అధీర, ఇనాయత్‌ ఖలీలు ఏం చేశారు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని