కొత్త సినిమాలు.. సరికొత్త అప్‌డేట్‌లు

కరోనా వైరస్‌ ప్రభావంతో షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇండస్ట్రీలో సందడి కరవయ్యిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ అనుమతులతో కొన్ని సినిమాల షూటింగ్స్‌ ఇటీవలే షురూ అయ్యాయి. దీంతో అభిమానుల చూపు తమవైపు తిప్పుకునేలా పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లను, ప్రత్యేక వీడియోలను నెట్టింట్లో విడుదల చేశారు...

Updated : 06 Jul 2021 19:00 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇండస్ట్రీలో సందడి కరవయ్యిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ అనుమతులతో కొన్ని సినిమాల షూటింగ్స్‌ ఇటీవలే షురూ అయ్యాయి. దీంతో అభిమానుల చూపు తమవైపు తిప్పుకునేలా పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లను, ప్రత్యేక వీడియోలను నెట్టింట్లో విడుదల చేశారు. అలా తాజాగా సోషల్‌మీడియాలో సందడి చేస్తోన్న పోస్టర్లపై ఓ లుక్కేయండి..

విష్ణు- కాజల్‌ ‘మోసగాళ్లు’

మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని నేపథ్యంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. నవదీప్‌ సైతం ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను వెంకటేశ్‌ విడుదల చేసి. సదరు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

అఖిల్ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’

అఖిల్‌-పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్‌-పూజా ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చాలా కాలం తర్వాత సెట్‌లోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని అఖిల్‌ తెలిపారు.’

నిత్యామేనన్‌ ‘గమనం’

నటి శ్రియ ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ మూగ మహిళ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాలో నిత్యామేనన్‌ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ తాజాగా ‘గమనం’ సినిమా నుంచి నిత్యామేనన్‌ ఫస్ట్‌లుక్‌ను శర్వానంద్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇందులో ఆమె శైలాపుత్రీదేవి అనే సింగర్‌గా కనిపించనున్నారు.

అదాశర్మ ‘క్వశ్చన్‌మార్క్‌?’

అదాశర్మ కథానాయికగా ప్రేక్షకులను అలరించేందుకు రానున్న చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌ ?’. విప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గౌరీకృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

కార్తికేయ ‘చావు కబురు చల్లగా..!’

కార్తికేయ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా..!’. కౌశిక్‌ .పి నూతన దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా సందడి చేయనున్నారు. ఈ నెల 21న కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకుని ‘చావు కబురు చల్లగా’ చిత్రం నుంచి ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకోనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని