రివ్యూ: నిపా వైరస్‌

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘నిపా వైరస్‌’ తెలుగులో ఎలా ఉందంటే?

Updated : 04 Dec 2020 16:39 IST

చిత్రం: నిపా వైరస్‌

నటీనటులు: కుంచకో బోబన్‌, టొవినో థామస్‌, పార్వతి తిరువత్తు, ఆసిఫ్‌ అలీ, రెహమాన్‌, సౌబిన్‌ షాహిర్‌, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, రేవతి తదితరులు

సంగీతం: సుశిన్‌ శ్యామ్‌

సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి, ఖలీద్‌

ఎడిటింగ్‌: సైజు శ్రీధరన్‌

నిర్మాత: ఆషిక్‌ అబు, రిమా కళింగల్‌

దర్శకత్వం: ఆషిక్‌ అబు

విడుదల: 04-12-2020(ఆహా)

ఏదో ఒక సందర్భంలో మానవాళిపై అనేక రకాల వైరస్‌లు దాడి చేస్తూనే ఉన్నాయి. సార్స్‌, ఆంత్రాక్స్‌, నిపా ఇప్పుడు కరోనా. కొన్ని ఆయా ప్రాంతాలకో.. దేశాలకో పరిమితం అయితే, కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించింది. గతంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గడగడలాడించిన నిపా వైరస్ ఈ కోవలోకే వస్తుంది‌. ముఖ్యంగా కేరళపై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టడంతో దాన్ని అదుపు చేయగలిగింది. ఆ భయానక పరిస్థితులను ఇతి వృత్తంగా తీసుకుని తెరకెక్కిన మలయాళ చిత్రం ‘వైరస్‌’. గతేడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అప్పట్లో కేరళ ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కొంది? అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంది?

కథేంటంటే: జక్రియా మహ్మద్‌(జక్రియా) తీవ్రమైన దగ్గు, వాంతులతో బాధపడతూ చికిత్స నిమిత్తం కోలికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌కి వస్తాడు. అతనికి ఏమైందో తెలుసుకునేలోపే జక్రియా మరణిస్తాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతనికి చికిత్స అందించిన నర్స్‌ అఖిల(రైమా) మరికొందరు కూడా అవే లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తారు. దీంతో అసలు ఈ వ్యాధి ఏంటి? ఎందుకు అందరూ ఇలా అస్వస్థతకు గురువుతున్నారని ఆరోగ్యశాఖ వర్గాలు రంగంలోకి దిగుతాయి. వివిధ పరీక్షల అనంతరం వారందరూ నిపా వైరస్‌ బారినపడినట్లు గుర్తిస్తారు. దీంతో ప్రభుత్వం నిపా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలు ఏంటి? నిపా కారణంగా ఎవరెవరి జీవితాలు ప్రభావితం అయ్యాయి? ఆ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు? నిపా బారిన పడ్డ వారి కుటుంబాలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ప్రపంచ దేశాలను వణికించిన వ్యాధుల్లో నిపా కూడా ఒకటి. అయితే, కొన్నేళ్ల కిందటి వరకూ ఇతర దేశాలకే పరిమితమైన ఈ వ్యాధి 2018లో కేరళలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా మలప్పురం, కోలికోడ్‌ జిల్లాలపై దాని ప్రభావం ఎక్కువగా పడింది. ఈ అంటువ్యాధినే కథా వస్తువుగా తీసుకుని ఆషిక్‌ అబు ‘వైరస్‌’ సినిమాను తీర్చిదిద్దాడు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, నర్సులు ఎలాంటి చికిత్స అందిస్తారు? వారితో ఎలా మాట్లాడతారు? వంటి సన్నివేశాలతో కథను ప్రారంభించాడు. ఆస్పత్రి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జక్రియా అనే వ్యక్తి అస్వస్థతకు గురవడం, అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం తదితర సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందో చూపించాడు. ఇందుకోసం కాస్త నిడివి ఎక్కువే తీసుకున్నట్లు అనిపిస్తుంది. వారందరికీ సోకింది నిపా అని తెలిసిన తర్వాత ఆస్పత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎలా భయపడతారు? వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చక్కగా చూపించాడు. ప్రభుత్వం రంగంలోకి దిగి నిపా బారిన పడ్డవారు ఎవరెవరిని కలిశారో తెలుసుకునే ప్రయత్నం.. అందుకు ఎలాంటి విధానం అనుసరిస్తుంది? తదితర సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి.

అంటువ్యాధులతో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేయడం ప్రభుత్వానికి, ఆస్పత్రి వర్గాలకు, కుటుంబ సభ్యులకు అతి పెద్ద సవాల్‌. వ్యాధి గురించి తెలిసిన తర్వాత మృతదేహాన్ని ముట్టుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అదంతా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలు చూస్తే, నిజ జీవితంలో మృతదేహాలను ఖననం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. కరోనా కారణంగా చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. అవన్నీ భావోద్వేగంగా సాగుతాయి. అదే సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆస్పత్రిలో పనిచేస్తున్న వారి కుటుంబాలు బయట సమాజం నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాయో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాంటి వారిని, వారి కుటుంబాలను అభినందించాల్సింది పోయి, దూరం పెట్టడం, వారిని అంటరాని వారిగా చూడటం నేటి ఆధునిక సమాజంలో ఇంకా మూఢనమ్మకాలతోనే ప్రజలు జీవిస్తున్నారంటూ చురకలంటించాడు. ఆ తర్వాత అసలు నిపా వైరస్‌కు మూలం ఎక్కడ ఉందనే ప్రయత్నం మొదలు పెడుతుంది ప్రభుత్వం. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఒకానొకదశలో ఇది ఉగ్రవాదుల చర్యా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఇండెక్స్‌  పేషెంట్‌(వ్యాధి సోకిన మొదటి వ్యక్తి)కు నిపా ఎలా సోకిందో తెలుసుకునేందుకు పెద్ద కసరత్తే చేయాల్సి వస్తుంది. చివరకు ఇది జీవాయుధం చర్య కాదని తెలుసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. నిపా కట్టడికి కృషి చేసిన వారిని ప్రభుత్వం అభినందించడంతో సినిమా ముగుస్తుంది.

ఎవరెలా చేశారంటే: ఇందులో రేవతి మినహా మిగిలిన వాళ్లందరూ తెలుగు ప్రేక్షకులకు తెలియని వాళ్లే. అయితే, ఎవరి పాత్రల్లో వాళ్లు చక్కగా ఒదిగిపోయి నటించారు. ప్రతి పాత్రకూ ఇందులో ప్రాధాన్యం ఉంది. ‘నిపా వైరస్‌’లాంటి మెడికల్‌ థ్రిల్లర్‌ ఆకట్టుకోవాలంటే సాంకేతిక బృందం పనితీరు ఎంతో ముఖ్యం. సుశిన్‌ శ్యామ్‌ చక్కటి సంగీతం అందించాడు. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ బాగుంది. ఆస్పత్రి వాతావరణం, రోగులు, అంటు వ్యాధులు ప్రబలినపుడు ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. సైజు శ్రీధరన్‌ ఎడిటింగ్‌కు కాస్త పనిచెప్పి ఉంటే బాగుండేది. అయితే, అక్కడి నేటివిటీతో పాటు, వైరస్‌ పరిస్థితులను చూపించేందుకు కొన్ని సన్నివేశాలను వదిలేశారేమో అనిపిస్తుంది. థియేటర్‌ వరకూ ఆ నిడివి ఉన్నా పర్వాలేదేమో కానీ, ఓటీటీకి వచ్చేసరికి కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే బాగుండేది.

దర్శకుడు ఆషిక్‌ అబు ఎంచుకున్న పాయింట్‌ విభిన్నమైంది. నిపా వైరస్‌నాటి పరిస్థితులను ప్రతి సన్నివేశం ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం అతను చేసిన కసరత్తు అంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, గతేడాది జూన్‌లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆహా ఓటీటీ వేదికగా వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో వచ్చి ఉంటే మరింత ఆకట్టుకునేది.

బలాలు బలహీనతలు
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ - నెమ్మదిగా సాగే కథనం
+ భావోద్వేగాలు - నిడివి
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా:  ‘నిపా వైరస్‌’.. కాస్త ఓపికతో చూస్తే, తప్పకుండా ఈ థ్రిల్లర్‌ అలరిస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని