‘ఓటీటీ’ ఆట మొదలైంది..

కరోనా ప్రభావంతో పరిశ్రమలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. సినిమా రంగానిదీ అదే పరిస్థితి. కోరుకోని అతిథిగా వచ్చిన కరోనా సినీ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఆ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ తిరిగి మామూలు..

Updated : 22 Aug 2022 16:40 IST

2020 ముగుస్తోంది.. మరి థియేటర్ల సంగతేంటి..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రభావంతో పరిశ్రమలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. సినిమా రంగానిదీ అదే పరిస్థితి. కోరుకోని అతిథిగా వచ్చిన కరోనా.. ఈ రంగాన్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ తిరిగి మామూలు స్థితి చేరుకునేందుకు ఇంకా మార్గాలను అన్వేషిస్తూనే ఉంది. ఈక్రమంలో ఎడారిలో ఒయాసిస్‌లా కనిపించిందే ఓటీటీ(ఓవర్‌ ది టాప్‌). అయితే.. పరిశ్రమలో అందరికీ కాకపోయినా చాలామందికి కడుపు నింపుతోంది. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలా.. ‘2020’ సినీ పరిశ్రమకు మోయలేనన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చినా.. ఓటీటీ వేదికలకు మాత్రం ఊతమిచ్చింది.

అనామకంగా మొదలై.. ఆదిపత్యం చెలాయిస్తూ..

2018లో భారతీయ ఓటీటీ పరిశ్రమ విలువ 21.5 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు కేవలం ఒక్క నెట్‌ఫ్లిక్స్‌ విలువ 217.08 బిలియన్ డాలర్లు.. అంతకంటే ఎక్కువే కావచ్చు. ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 193 మిలియన్ల చందాదారులను కలిగి ఉంది. సినీ ఇండస్ట్రీలో థియేటర్లు రాజ్యమేలే సమయంలో అనామక వ్యాపారంగా మొదలైంది ఓటీటీ బిజినెస్‌. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అపరిమితమైన లాభాలు గడిస్తోన్న డిజిటల్‌ వేదికగా అవతరించింది. కరోనా ప్రభావం.. డిజిటలైజేషన్‌.. ఇలా కారణమేదైనా ఓటీటీల పంట పండటం మొదలైంది.

అసలు ఇంతలా ఓటీటీ ప్రయాణంలో అద్భుతాలు చోటు చేసుకోవడానికి కారణాలేంటి..?

- తక్కువ ఖర్చుతో సినిమాను ఆస్వాదించే అవకాశం కలగడం.

- భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు సినిమాలు అందించడం.

- థియేటర్లు దొరకని చిన్న, మంచి సినిమాలకు వేదికనివ్వడం.

- ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు

- కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలు, క్రైమ్‌ స్టోరీలు, థ్రిల్లర్‌ ఇలా అన్ని రకాల సినిమాల సమాహారాన్ని ప్రేక్షకుడి ముందుంచడం.

- ఓటీటీ రంగంలో పెరిగిన పోటీతత్వం.

- సినిమాల్లో చూడలేని ప్రతిభావంతులైన నటీనటులను చూసే అవకాశం రావడం.

ఓటీటీ.. పోటాపోటీ..

క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘జమ్‌తారా: సబ్‌కా నంబర్ అయేగా’తో నెట్‌ఫ్లిక్స్‌ 2020 ప్రారంభించింది. ఆ వెబ్‌ సిరీస్‌ మిశ్రమ ఫలితాలు సాధించింది. ఆ తర్వాత ‘ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌’ నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్ల్రైబర్ల సంఖ్యను భారీగా పెంచింది. ఆ సిరీస్‌లో నటించిన సీమా టపారియాను రాత్రికిరాత్రే పెద్ద సెలబ్రిటీని చేసేసింది. గతేడాది వచ్చిన ‘దిల్లీ క్రైమ్‌’ ఏకంగా ఎమ్మీ పురస్కారం గెలిచింది. ‘ది ఫ్యాబులస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ కూడా బాగానే అలరిస్తోంది. అమెజాన్‌ కూడా మంచి వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో అలరిస్తోంది. ఇందులో వచ్చిన ‘జల్లికట్టు’ ఏకంగా ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ప్రాంతీయ అభిమానులను ఆకర్షించడంలో నెట్‌ఫ్లిక్స్ కంటే అమెజాన్‌ ఒక మెట్టుపైనే ఉంది. ఇందులో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది వచ్చిన మిర్జాపూర్‌-2 సిరీస్‌ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో పాటు ‘పాతాల్‌ లోక్‌’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హర్షద్‌ మెహతా కథ ఆధారంగా తెరకెక్కిన ‘స్కామ్‌ 1992’ సోనిలివ్‌లో ప్రసారమవుతోంది. అది కూడా ఈ సంవత్సరంలో అతి పెద్ద విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌గా నిలిచింది. సోనీ ఓటీటీ సంస్థ అయిన సోనీలివ్‌కు ఈ వెబ్‌ సిరీస్‌ వల్లే ఊహించని రీతిలో చందాదారులు పెరిగిపోయారు. డిస్నీ+హాట్‌స్టార్‌లో శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ నటించిన గుంజన్‌ సక్సేనా.. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 

వద్దూ వద్దంటూనే.. మద్దతు

సినీ దిగ్గజాలు బయటికి.. తాము ఓటీటీలకు వ్యతిరేకమని.. వాటి వల్ల సృజనాత్మకకు తావుండదని అంటున్నా.. వెబ్‌ సిరీస్‌లు చేస్తూ పరోక్షంగా ఓటీటీలను ప్రోత్సహిస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌, సుష్మితాసేన్‌, కరిష్మా కపూర్‌ వంటి అగ్రశ్రేణి నటులు నటించిన వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదల కావడమే ఇందుకు నిదర్శనం. చాలా మంది నటులు సినిమాలతో సాధ్యం కాని గుర్తింపును వెబ్‌ సిరీస్‌ల ద్వారా సొంతం చేసుకుంటున్నారు. అందులో పంకజ్‌ త్రిపాఠి, షెఫాలిషా, నవాజుద్దీన్ సిద్దిఖీ, మనోజ్ బాజ్‌పేయి వంటి నటులు ఎంతో మంది ఒక్కసారిగా స్టార్లయిపోయారు.

థియేటర్ల  సంగతేంటి..?

సినీ అభిమానుల దాహాన్ని ఓటీటీలైతే తీర్చుతున్నాయి. మరి సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి..? వాటినే నమ్ముకున్న కార్మికుల సంగతేంటి..? అంటే అవి ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలే అని చెప్పాలి. ఎందుకంటే.. లాక్‌డౌన్‌ ముగిసిన కొంతకాలానికి థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల రాకపోవడం అసలు సమస్యగా మారింది. ఇప్పటికే తమిళనాడులో థియేటర్లను ఓపెన్‌ చేసి 50శాతం సామర్థ్యంతో సినిమాలు ఆడించొచ్చని ప్రభుత్వం చెప్పింది. తీరా థియేటర్లు తెరిచి చూస్తే కనీసం 10శాతం కూడా సీట్లు నిండటం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. నిర్మాతలకు.. థియేటర్‌ యాజమాన్యాలకు మధ్య గొడవ మరో ఆటంకం. థియేటర్ల భవితవ్యం ఏంటనేది తెలియాలి అంటే మొదట ఈ సమస్యలకు పరిష్కారం దొరకాలి. ఆ తర్వాత డిజిటల్‌ హావాను ఎదుర్కొంటూ ఓటీటీలను ఢీకొట్టడం ఎలా అనే విషయంపై థియేటర్లు ఆలోచించాలి.

ఇదీ చదవండి..

వీరిని వెబ్‌సిరీస్‌లే నిలబెట్టాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని