సోహైల్‌ ‘కథ వేరే ఉంటది’.. లిఫ్ట్‌లో అనసూయ!

కరోనా పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ నెమ్మదిగా బయటపడుతోంది. ఇటు యువ కథానాయకులతో పాటు, అటు అగ్ర కథానాయకులు

Updated : 29 Oct 2023 11:18 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ నెమ్మదిగా బయటపడుతోంది. ఇటు యువ కథానాయకులతో పాటు, అటు అగ్ర కథానాయకులు సైతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నాయి. మరికొన్ని కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త కబుర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలా తాజాగా మన టాలీవుడ్‌లో సినిమా ముచ్చట్లు ఏంటో చూద్దామా!

‘కథ వేరే ఉంటది’ అంటున్న సోహైల్‌

‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’లో సెకండ్‌ రన్నరప్‌గా నిలవడమే కాదు, తన స్మార్ట్‌ గేమ్‌తో రూ.25లక్షలు సొంతం చేసుకున్న నటుడు సోహైల్‌. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ వింజంపాటి దర్శకత్వంలో సోహైల్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ‘జార్జిరెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.


లిఫ్ట్‌లో ఇరుక్కున్న అనసూయ

ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా అలరిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న నటి అనసూయ. విరాజ్‌ అశ్విన్‌తో కలిసి ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్‌’. గురువారం ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు. ఇందులో అనసూయ గర్భిణి పాత్ర పోషిస్తున్నారు. ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినట్లు చూపించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.


‘చూశానే.. చూశానే’ అంటున్న కల్యాణ్‌దేవ్‌

కల్యాణ్‌దేవ్‌, రచిత రామ్‌ కీలక పాత్రల్లో పులి వాసు దర్శకత్వ వహిస్తున్న చిత్రం ‘సూపర్‌ మచ్చి’. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులోని ‘చూశానే.. చూశానే’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. కేకే సాహిత్యం అందించిన ఈ పాటకు రిటా త్యాగరాజన్‌ ఆలపించారు.


మళ్లీ థియేటర్‌లో ఆ సినిమాలు

* నాని, సుధీర్‌బాబు,నివేదా థామస్‌, అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘వి’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం మళ్లీ థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

* రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఇప్పటికే ఆహా ఓటీటీలో అలరించిన ఈ చిత్రం  కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31న థియేటర్‌లలో విడుదల కానుంది.


మరికొన్ని ముచ్చట్లు

* జయం రవి కీలక పాత్రలో లక్ష్మణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూమి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా డిస్నీ+ హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌కానుంది.


* వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సయీ మంజ్రేకర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గురువారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం.


* కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ తర్వాత తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’చిత్రానికి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.


* మహేశ్‌బాబు సతీమణి నమ్రత, ఆయన కుమార్తె సితార గురువారం యానిమేషన్‌ సిరీస్‌ ‘ఫెంటాస్టిక్‌ తార’ను విడుదల చేశారు.


* జగపతిబాబు, రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామ్‌ కీలక పాత్రల్లో విద్యా సాగర్‌రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫాదర్‌-చిట్టి-ఉమ-కార్తీక్‌’. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని