సోనూ సూద్‌ చెప్పిన కథ.. విన్నారా?

విమర్శలకు సోనూ ఇటీవల ఓ ముఖాముఖిలో కథ రూపంలో జవాబిచ్చారు.

Updated : 22 Sep 2020 14:53 IST

విమర్శలకు బొమ్మాళీ నటుడి జవాబు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ కాలంలో తమను స్వస్థలాలకు చేర్చిన నటుడు సోనూ సూద్‌ను వేలాది మంది వలస కార్మికులు దేవుడిగా కీర్తిస్తున్నారు. అయితే ఏదో ప్రయోజనం ఆశించకుండా ఆయన ఇదంతా ఎందుకు చేస్తారని అన్నవారూ ఉన్నారు. ఈ విమర్శలకు సోనూ ఇటీవల ఓ ముఖాముఖిలో కథ రూపంలో జవాబిచ్చారు.

‘‘నేను చిన్నప్పుడు ఓ కథ విన్నాను. ఓ సాధువు వద్ద ఒక ఉత్తమ జాతి గుర్రం ఉండేది. దానిని తనకు ఇవ్వమని ఓ దొంగ అడగ్గా.. సాధువు తిరస్కరిస్తాడు. కొంతదూరం ప్రయాణించాక, నడవలేక నడుస్తున్న ఓ ముదుసలి సాధువుకు కనిపిస్తాడు. సాధువు జాలితో ఆ ముసలి వ్యక్తికి తన గుర్రాన్ని ఇచ్చేస్తాడు. అయితే గుర్రం మీద కూర్చున్న వెంటనే అ వ్యక్తి భయంకరంగా నవ్వి.. తానే ఆ దొంగ అనే సంగతి బయటపెడతాడు. అప్పుడు సాధువు అతన్ని అపి.. అతను గుర్రాన్ని తీసుకోవచ్చని కానీ ఈ విధంగా తీసుకున్నట్టు ఎవరికీ చెప్పవద్దంటాడు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే వారు అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయటం మానేస్తారని దొంగను కోరుతాడు. ఇప్పుడు నేనూ అదే చెప్తున్నాను. ఇది (విమర్శలు) మీ వృత్తి.. దీని వల్ల మీకు వేతనం లభిస్తుంది కాబట్టి మీరు చేయవచ్చు. కానీ మీ మాటలు, చేతల ప్రభావం నాపై పడదు. నేను నా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటాను’’ అని సోనూ అన్నారు.

ఏడు లక్షల మంది వివరాలున్నాయి..

అంతేకాకుండా ‘‘నేను సహాయం చేసిన 7,03,246 వ్యక్తుల చిరునామా, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ కార్డు సంఖ్యతో సహా అన్ని వివరాలు నా వద్ద ఉన్నాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చేందుకు నేను సహాయపడిన విద్యార్థుల వివరాలు కూడా ఉన్నాయి. నేను విమర్శించిన వారందరికీ జవాబివ్వాలనుకోవటం లేదు. కానీ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. నన్ను విమర్శించే బదులు, కాస్త బయటకి వెళ్లి ఎవరికైనా సహాయం చేయండి’’ అని ఆయన కోరారు.

సోనూ రాజకీయాల్లోకి వచ్చేందుకే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాగా, తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని.. నటనలో తాను చేరాల్సిన శిఖరాలు ఎన్నో ఉన్నాయని ఈ నటుడు గతంలో కూడా ఎన్నోసార్లు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని