ఇకపై ప్రతి సినిమాకీ ఇలా చేస్తా..!

ఇకపై తాను నటించబోయే ప్రతి సినిమాకి గుర్తుగా ఓ మొక్కను నాటుతానని నటుడు సుధీర్‌బాబు ప్రతిజ్ఞ చేశారు. తాజాగా ఆయన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నటుడు నవీన్‌ కృష్ణ నామినేట్‌ చేయడంతో ఛాలెంజ్‌ను స్వీకరించిన సుధీర్‌ ఓ మొక్కను నాటి దానికి ‘వి’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ....

Published : 10 Sep 2020 11:36 IST

ఆదితి, నివేదాను నామినేట్‌ చేసిన సుధీర్‌

హైదరాబాద్‌: ఇకపై తాను నటించబోయే ప్రతి సినిమాకీ గుర్తుగా ఓ మొక్కను నాటుతానని నటుడు సుధీర్‌బాబు ప్రతిజ్ఞ చేశారు. తాజాగా ఆయన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నటుడు నవీన్‌ కృష్ణ నామినేట్‌ చేయడంతో ఛాలెంజ్‌ను స్వీకరించిన సుధీర్‌ ఓ మొక్కను నాటి దానికి ‘వి’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరుతో గొప్ప కార్యక్రమానికి నాంది పలికిన ఎంపీ సంతోష్‌కుమార్‌కి అభినందనలు. ఈ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్‌ చేసిన నవీన్‌ కృష్ణకు ధన్యవాదాలు. ఇకపై నేను చేయబోయే ప్రతి చిత్రానికి గుర్తుగా ఓ మొక్కను నాటుతానని, అలాగే ఆ సినిమా పేరుని మొక్కకు పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని ‘వి’ సినిమా నుంచి ప్రారంభిస్తున్నాను. దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత దిల్‌రాజు, ఆదితిరావు హైదరీ, నివేదా థామస్‌ను ఈ ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేస్తున్నాను’ అని సుధీర్‌బాబు పేర్కొన్నారు.

సుధీర్‌బాబు పవర్‌ఫుల్ పోలీస్‌ అధికారిగా నటించిన ‘వి’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. నాని ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ కథానాయికలుగా మెప్పించారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని