అక్షరహాసన్‌తో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్నా!

నటి అక్షరహాసన్‌తో తాను నాలుగేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నానని నటుడు తనూజ్‌ వీర్వాణి తెలిపారు. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని ఆయన అన్నారు. అంతేకాకుండా 2018లో అక్షరహాసన్‌ ప్రైవేట్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు. ఆ విషయంతో తనకి ఎలాంటి సంబంధం లేదని...

Published : 28 Nov 2020 16:10 IST

నటి ప్రైవేట్‌ ఫొటోలు లీక్‌ గురించి స్పందించిన తనూజ్‌ వీర్వాణి

ముంబయి‌: నటి అక్షరహాసన్‌తో తాను నాలుగేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నానని నటుడు తనూజ్‌ వీర్వాణి తెలిపారు. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం విడిపోయామని ఆయన అన్నారు. అంతేకాకుండా 2018లో అక్షరహాసన్‌ ప్రైవేట్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంపై ఆయన మొదటిసారి స్పందించారు. ఆ విషయంతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న తనూజ్‌ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. 

‘‘డేటింగ్‌లో ఉన్న అమ్మాయి గురించి బయటకు చెప్పడం నాకస్సలు నచ్చదు. ఎందుకంటే, వృత్తిపరంగా అందరూ నన్ను గుర్తించాలి తప్ప నా వ్యక్తిగత విషయాల వల్ల కాదు. కానీ, సమయం వచ్చింది కాబట్టి ఈరోజు చెబుతున్నాను. అక్షర-నేనూ నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్నాం. ఇష్టప్రకారమే కొన్నేళ్ల క్రితం మేమిద్దరం విడిపోయాం. ఆ తర్వాత కూడా చాలాసార్లు కలిశాం. పార్టీలకు వెళ్లాం. అలా మేమిద్దరం స్నేహితులమయ్యాం. తన బాయ్‌ఫ్రెండ్‌ని కూడా అక్షర నాకు పరిచయం చేసింది. అలాగే నేనూ నా గర్ల్‌ఫ్రెండ్‌ని తనకి చూపించాను.’’ అని తనూజ్‌ చెప్పాడు.

‘‘2018లో తన ప్రైవేట్‌ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకైన సమయంలో అక్షర మొదట నాకే ఫోన్‌ చేసి.. జరిగిన విషయం చెప్పింది. 2013 నాటి తన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం గురించి నాకేమైనా తెలుసేమోనని ఆరా తీసింది. అసలు ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టాలని మేమిద్దరం ఎంతో ప్రయత్నించాం. అక్షరకు జరిగినట్లు ఏ అమ్మాయికీ జరగకూడదు. అయితే, అక్షరహాసన్‌ ప్రైవేట్‌ చిత్రాలను నేనే బయటపెట్టానని చాలా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇదే విషయం గురించి ఆమెతో మాట్లాడగా.. ‘నాకు నీపై నమ్మకం ఉంది. నువ్వు ఇలా చేసి ఉండవు’ అని సమాధానమిచ్చింది. వ్యక్తిగతంగా నా ఎదుట ఆ సమాధానం చెప్పినప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం ఒక్క ప్రకటన కూడా విడుదల చేసి.. నా తప్పులేదని చెప్పలేకపోయింది. ఆ విషయంలో ఎంతో బాధపడ్డాను. అప్పుడే తనకి దూరంగా వచ్చేశాను. నా వర్క్‌ నేను చేసుకుంటున్నాను. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నమ్ముతున్నాను.’’ అని తనూజ్‌ వీర్వాణి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని